దుబాయ్ ఎయిర్షోలో విషాదం చోటు చేసుకుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. శుక్రవారం స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్షోలో విన్యాసాలు చేస్తుండగా.. తేజస్ ఒక్కసారిగా కూలిపోయి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో యుద్ధ విమాన పైలట్ ప్రాణాలు కోల్పోయినట్లు భారత వాయుసేన వెల్లడించింది.
'దుబాయ్ ఎయిర్షోలో తేజస్ ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో పైలట్కు తీవ్ర గాయాలై మృతిచెందడం దిగ్భ్రాంతికరం. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ కష్టసమయంలో పైలట్ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతాం' అని వాయుసేన తమ ప్రకటనలో తెలిపింది. యుద్ధ విమానం ఒక్కసారిగా కూలి మంటలు చెలరేగిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
నెగెటివ్ జీ-ఫోర్స్ టర్న్ నుంచి పైలట్ యుద్ధవిమానాన్ని వెనక్కి మళ్లించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. దుబాయ్ ఎయిర్షో ప్రపంచంలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు చెందిన విమానయాన సంస్థలు ఈ ఎయిర్షోలో పాల్గొని సందడి చేస్తాయి.
ఇక, ప్రమాదానికి గురైన తేజస్ యుద్ధ విమానాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. ఇది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 4.5వ తరం ఫైటర్జెట్. ప్రస్తుతం భారత వాయుసేనలో ఎంకే1 తేజస్ జెట్లు ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు ప్రమాదానికి గురవడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో రాజస్థాన్లోని జైసల్మేర్లో తేజస్ ఫైటర్ జెట్ శిక్షణ సార్టీలో ఉండగా.. కూలిపోయింది. ఆ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు.