భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి అనారోగ్యానికి గురవడంతో ఆమె వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె స్నేహితురాలు, క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్బాష్ లీగ్కు దూరమైంది. ఈ విషయాన్ని బ్రిస్బేన్ హీట్ జట్టు వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్మృతికి అండగా నిలిచేందుకు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపింది.
నవంబరు 9వ తేదీన మహిళల బిగ్బాష్ లీగ్ 11వ సీజన్ ప్రారంభమైంది. ఇందులో బ్రిస్బేన్ హీట్ జట్టుకు జెమీమా ప్రాతినిధ్యం వహిస్తోంది. అయితే, స్మృతి మంధాన వివాహం నిమిత్తం 10 రోజుల క్రితం జెమీమా భారత్కు తిరిగొచ్చింది. కానీ, అనివార్య కారణాల వల్ల ఆ వేడుకలు నిలిచిపోయాయి. దీంతో స్మృతి, ఆమె కుటుంబానికి మద్దతుగా ఉండేందుకు జెమీమా స్వదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నట్లు బ్రిస్బేన్ హీట్ జట్టు సీఈఓ టెర్రీ స్వెన్సన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
'జెమీకి ఇది నిజంగా సవాలుతో కూడుకున్న సమయం. ఆమె బిగ్బాష్ లీగ్లో కొనసాగకపోవడం అభిమానులకు అసంతృప్తి కలిగించే విషయమే. కానీ, ఆమె వ్యక్తిగత ప్రాధాన్యాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. అందుకే ఆమె అభ్యర్థనను మేం అంగీకరించాం. ఆమెకు, స్మృతి మంధాన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాం' అని టెర్రీ స్వెన్సన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్తో స్మృతి వివాహం ఇటీవల చివరి నిమిషంలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వాస్తవానికి స్మృతి - పలాశ్ వివాహం నవంబరు 23 బెంగళూరు వేదికగా జరగాల్సి ఉంది. అయితే, వివాహ వేడుకల్లో పాల్గొంటుండగా స్మృతి తండ్రి అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పలాశ్ కూడా అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఈ వివాహం రద్దు అయింది. అదేసమయంలో పలాస్ ముచ్చల్ ఓ మహిళతో చేసిన చాటింగ్ స్క్రీన్ షాట్స్ వెలుగులోకి వచ్చాయి. దీంతో స్మృతి మంథాన తన ఇన్స్టాలో పెళ్లి వేడుకలకు సంబంధించిన పోస్ట్లను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.