భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ క్రీడాకారిణి స్మృతి మంధానకు కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ అనారోగ్యానిగి గురయ్యారు. దీంతో ఆయనను ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా, స్మృతి మంధాన తండ్రి అనారోగ్యానికి గురవడంతో ఆదివారం మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్తో జరగాల్సిన వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఆదివారం రాత్రి వరుడు పలాశ్ ముచ్చల్ కూడా అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు వారి సన్నిహితులు వెల్లడించారు. వైరల్ ఇన్ఫెక్షన్, అసిడిటీ కారణంగా పలాశ్ అనారోగ్యానికి గురయ్యాడని వైద్యులు వెల్లడించారు. చికిత్స అనంతరం అతడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
కాగా ఆదివారం స్మృతి మంధాన తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయన సాంగ్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొన్ని రోజుల కిందటే మంధాన వివాహ వేడుకలు మొదలయ్యాయి. మెహందీ, హల్దీ, సంగీత్ కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం వివాహం జరగాల్సి ఉండగా ఆమె తండ్రి అనారోగ్యానికి గురవడంతో పెళ్లిని వాయిదా వేస్తున్నట్టు మంధాన తెలిపారని ఆమె మేనేజర్ ప్రకటించారు.