Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీకా వేసుకున్నా కరోనా వైరస్ సోకదన్న గ్యారెంటీ లేదు : సీరమ్ ఇనిస్టిట్యూట్

టీకా వేసుకున్నా కరోనా వైరస్ సోకదన్న గ్యారెంటీ లేదు : సీరమ్ ఇనిస్టిట్యూట్
, సోమవారం, 18 జనవరి 2021 (06:59 IST)
ప్రస్తుతం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ఇపుడు అందుబాటులోకి వచ్చింది. ఈ టీకాల వినియోగం దేశంలో ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైంది. అయితే, తొలి టీకా వేసుకున్న వారు 28 రోజుల తర్వాత రెండో డోసును తీసుకోవాల్సివుంది. అయితే, ఈ టీకా వేసుకున్న తర్వాత ఈ వైరస్ సోకదన్న గ్యారెంటీ లేదని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాధవ్ అంటున్నారు. 
 
రెండు డోసుల మధ్య రోజుల తేడాను మరికొన్ని వారాలు పెంచితే టీకా ప్రభావం మరింత పెరుగుతుందని సీరమ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాధవ్ చెప్పారు. 'రెండు డోసుల మధ్య తేడా నాలుగు వారాలైనా మంచి ఫలితాలే వస్తాయి. కరోనా నుంచి టీకా రక్షణ ఇస్తుంది. అయితే దాని ప్రభావం 70 నుంచి 80 శాతమే ఉంటుంది. రెండో డోసు వేసుకోవడానికి 28 రోజులకు మరో ఆరు వారాలు లేదా 8 లేదా 10 వారాల టైంను పెంచితే మరింత మంచి ఫలితాలు వస్తాయి' అని వివరించారు. 
 
28 రోజుల తేడా ప్రాతిపదికనే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చేశామని, ఇప్పుడు వ్యాక్సినేషన్ కూ దానినే ప్రామాణికంగా తీసుకున్నారని సురేశ్ చెప్పారు. కరోనా నుంచి దీర్ఘకాలిక రక్షణ కావాలంటే టైం గ్యాప్ ను పెంచితే బాగుంటుందన్నారు. కరోనా సోకినా కూడా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. కరోనా వచ్చినోళ్లకూ మళ్లీ సోకుతోందని, కాబట్టి వ్యాక్సిన్ వేసుకుంటేనే మంచిదని చెప్పారు.
 
వ్యాక్సిన్ వేసుకున్నా కరోనా వచ్చే అవకాశాలున్నాయని ఆయన తేల్చి చెప్పారు. అన్ని జబ్బుల్లాగే ఇది కూడా అని అన్నారు. అయితే, టీకా వేసుకున్న తర్వాత కరోనా సోకినా అంత తీవ్రంగా మాత్రం ఉండదని, లక్షణాలు కూడా కనిపించవని వివరించారు.  ఏదో ఒక కంపెనీ వ్యాక్సిన్ మాత్రమే తీసుకోవాలని, వేర్వేరు కంపెనీల వ్యాక్సిన్లు ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవద్దని చెప్పారు. రెండు రకాల టీకాల్లో వాడే టెక్నాలజీ వేరని, కాబట్టి ఫస్ట్ డోసు టైంలో ఏ కంపెనీ టీకా అయితే తీసుకున్నారో.. రెండో డోసుకూ అదే కంపెనీ టీకా తీసుకోవాలని సూచించారు.
 
మరోవైపు, కొవ్యాగ్జిన్ టీకా తీసుకున్న ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సెక్యూరిటీ గార్డుకు స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. 20 ఏళ్ల సెక్యూరిటీ గార్డుకు శనివారం సాయంత్రం 4 గంటలకు టీకా వేశారని, పావుగంటలోనే అతడి చర్మంపై దద్దుర్లు వచ్చాయని చెప్పారు. గుండె కొట్టుకునే వేగం పెరిగిందన్నారు. వెంటనే అతడిని వైద్యులు పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించామన్నారు.
 
తర్వాత కొద్దిసేపటికి అతడు కోలుకున్నాడని రణ్ దీప్ గులేరియా వివరించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. ప్రస్తుతం అతడిని అబ్జర్వేషన్ లోనే ఉంచామని వెల్లడించారు. కాగా, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చిన వాళ్లను అబ్జర్వేషన్‌లో పెట్టామని, తర్వాత వాళ్ల పరిస్థితి మెరుగు పడిందని ఉన్నతాధికారులు చెప్పారు. ఒకే ఒక్కరికి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐస్‌క్రీమ్‌లో కరోనా వైరస్ : చైనాలో మళ్లీ కలకలం