Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూలై ఆఖరుకు రెండో కరోనా ఖతం... ఆ తర్వాత మూడో కరోనా ప్రారంభం

జూలై ఆఖరుకు రెండో కరోనా ఖతం... ఆ తర్వాత మూడో కరోనా ప్రారంభం
, గురువారం, 20 మే 2021 (08:21 IST)
ప్రస్తుతం దేశాన్ని కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి పట్టిపీడిస్తోంది. ప్రతి రోజూ దాదాపు మూడు లక్షల మంది వరకు ఈ వైరస్ బారినపడుతున్నారు. అలాగే, వేలాది మంది ఈ వైరస్ కోరల్లో చిక్కి చనిపోతున్నారు. ఈ క్రమంలో వచ్చే జూలై నాటికి రెండో దశ వ్యాప్తి ఉధృతి తగ్గిపోతుందని, ఆ తర్వాత థర్డ్‌ వేవ్‌ మొదలయ్యేందుకు 6 నుంచి 8 నెలల సమయం పడుతుందని కేంద్రం నియమించిన ముగ్గురు సభ్యుల శాస్త్రవేత్తల బృందం అంచనా వేసింది. 
 
ప్రస్తుతం చేస్తున్న పరీక్షలు, నమోదవుతున్న కేసుల సరళిని బట్టి శాస్త్రవేత్తలు ఈ అంచనాలను రూపొందించారు. ఈ క్రమంలో.. మే నెల చివరి వారం నాటికి రోజువారీ కేసులు 1.5 లక్షలకు తగ్గుతాయని, జూన్‌ చివరి నాటికి 20 వేల స్థాయిలో కేసులు నమోదవుతాయని అంచనా వేశారు. 
 
ముఖ్యంగా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, జార్ఖండ్‌, రాజస్థాన్‌, కేరళ, సిక్కిం, ఉత్తరాఖండ్‌, గుజరాత్‌, హరియాణా, ఢిల్లీ, గోవా రాష్ట్రాలు ఇప్పటికే కేసుల నమోదులో పతాకస్థాయిని చూసేశాయని ఈ బృందంలోని శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌ తెలిపారు. 
 
మే నెల ఆఖరు నాటికి మిగిలిన రాష్ట్రాలు కూడా పతాకస్థాయిని చేరుకుంటాయని అంచనా వేశారు. ఆ తర్వాత 6-8 నెలల్లో థర్డ్‌ వేవ్‌ ఉంటుందని, అప్పటికి దేశంలో అధిక శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయి ఉంటుంది కాబట్టి.. దాని ప్రభావం ఈ స్థాయిలో ఉండకపోవచ్చని శాస్త్రవేత్తల బృందం అంచనా వేసింది. కానీ అంతర్జాతీయ వైద్య నిపుణులు మాత్రం థర్డ్ వేవ్ మరింత భయంకరంగా ఉంటుందని హెచ్చరిస్తున్న విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రఘురామరాజు పచ్చి అబద్దాలకోరు : సుప్రీంకోర్టులో ఏపీ సర్కారు అఫిడవిట్