Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Dhoni: భారత్ ఓటమికి ధోనీని విలన్‌గా చూపడం సబబేనా?

Dhoni: భారత్ ఓటమికి ధోనీని విలన్‌గా చూపడం సబబేనా?
, సోమవారం, 1 జులై 2019 (20:05 IST)
ప్రపంచకప్ 2019 మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారత్‌ను 31 పరుగులతో ఓడించింది. 338 పరుగుల టార్గెట్ చేజ్ చేయడానికి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా వచ్చినప్పుడు, కొన్ని ఓవర్లలోనే భారత్ ఈ మ్యాచ్ గెలవడం కష్టం అనిపించింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ మొదటి నుంచీ ధాటిగా ఆడారు, భారత బౌలర్లను ఉతికేశారు. దాంతో అంత పెద్ద లక్ష్యాన్నిఅందుకోడానికి, చివరి 5 ఓవర్లలో టార్గెట్ కష్టంగా మారకుండా గట్టి ప్రారంభం ఉండాలని అందరికీ అర్థమైంది.
 
టీమిండియా కూడా లక్ష్యాన్ని వెంటాడింది. కానీ అందులో విజయం సాధించలేకపోయింది. దాంతో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి లక్ష్యంగా మారాడు. ధోనీ బ్యాటింగ్ గురించి భారత్ కంటే పాకిస్తాన్ నుంచే ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. ధోనీ పాకిస్తాన్‌లో ట్విటర్ టాప్ ట్రెండ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఆదివారం భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ కోసం కామెంట్రీ చేశాడు. చివరి ఐదు ఓవర్లలో ధోనీ ఆట చూసి హుస్సేన్ కూడా చికాకుపడిపోయాడు. "ధోనీ ఏం చేస్తున్నాడు. అతను కనీసం ప్రయత్నించాలిగా" అన్నాడు.
 
ఆశలన్నీ చివరి 5 ఓవర్లపైనే..
హుస్సేన్ వ్యాఖ్యలను ఆయన సహ కామెంట్రేటర్ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఒప్పుకున్నట్టే కనిపించింది. నాజిర్ హుస్సేన్ చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాయి కానీ 338 పరుగుల టార్గెట్ చేజ్ చేయాలంటే చివరి 5 ఓవర్లలో సాధ్యం కాదనే విషయం వాళ్లిద్దరూ మర్చిపోయారు.
 
భారత్ మొదటి 'పవర్ ప్లే' అంటే ప్రారంభ 10 ఓవర్లలో 28 పరుగులే చేసింది. అలాగే, ఆఖరి 5 ఓవర్లలో కేదార్ జాధవ్, ధోనీ కేవలం 3 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టగలిగారు, 20 సింగిల్స్ తీశారు. ఇక ఆరు బంతులకు ఒక్క పరుగు కూడా రాలేదు. భారత్ తన మొదటి పది ఓవర్లు, చివరి ఐదు ఓవర్లు ఎలా ఆడిందో గమనిస్తే, జట్టు గెలవడం కోసం ఆడడం లేదనే విషయం అర్థమవుతుంది.
webdunia
 
మొదటి 'పవర్ ప్లే'లో భారత్ ప్రారంభం అవసరానికంటే స్లోగా ఉంది. మొదట పిచ్‌లో నిలదొక్కుకోవాలని చూసే రోహిత్ శర్మ లాంటి బ్యాట్స్‌మెన్ ఈ మ్యాచ్‌లో కూడా అలాగే కనిపించాడు. అయితే ఇది చిన్న లక్ష్యం కాదని తనకు తెలుసు. మొదటి పవర్ ప్లేలో 28 పరుగులకు ఒక వికెట్ అనేది ఈ ప్రపంచ కప్‌లోనే అత్యంత 'స్లో స్టార్ట్'.
 
భారత్ ఇన్నింగ్స్ ప్రారంభించాక రెండో ఓవర్లో సెకండ్ స్లిప్‌లో ఉన్న జోరూట్ సులభమైన క్యాచ్ మిస్ చేసినప్పుడు రోహిత్ శర్మకు లైఫ్ వచ్చింది. భారత్ ఓటమి స్క్రీన్‌ప్లేను మొదటే రాసేసింది. మొదటి 10 ఓవర్లలో 42 బంతుల్లో ఎవరూ ఒక్క పరుగు కూడా చేయలేకపోయారు.
 
'స్లో స్టార్ట్‌'పై కోహ్లీ ఏమన్నాడు
కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ప్రారంభం నెమ్మదిగా ఉందనే విషయాన్ని కొట్టిపారేశాడు. "మేం మొదటి వికెట్ పడగానే అలర్ట్ అయ్యాం. ప్రారంభంలోనే వికెట్ పడిపోవడం వల్ల ఒత్తిడి ఉంటుంది. మేం కేఎల్ రాహుల్‌ను మొదట్లోనే కోల్పోయాం. ఇంగ్లండ్ బౌలర్లు మొదటి 10 ఓవర్లూ అద్భుతంగా బౌలింగ్ చేశారు" అన్నాడు.
 
ధోనీ, జాధవ్ దీనిపై ఏ కామెంట్ చేయకపోయినా, రోహిత్ శర్మ మాత్రం వారిని వెనకేసుకొచ్చాడు. "మహి, కేదార్ పెద్ద షాట్లు కొట్టాలని ప్రయత్నించారు. కానీ స్లో పిచ్ వల్ల అది సాధ్యం కాలేదు. మీరిక్కడ ఇంగ్లండ్ జట్టును అభినందించాలి. వాళ్లు అద్భుతంగా ఆడారు" అన్నాడు. అయితే ధోనీ స్లో బ్యాటింగ్‌ను రోహిత్, విరాట్‌కు ఆటతో పోల్చి చూడలేం. ఇదే మ్యాచ్‌లో రోహిత్ శర్మ 109 బంతులకు 102, కెప్టెన్ కోహ్లీ 76 బంతులకు 66 రన్స్ చేసారు. అంటే ఇద్దరూ పరుగుల కంటే ఎక్కువ బంతులు ఆడారు కానీ ధోనీ కూడా 31 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ తరఫున సిక్సర్ కొట్టిన ఒకే ఒక్కడు ధోనీనే. అటు ఇంగ్లండ్ మొత్తం 13 సిక్సర్లు కొట్టింది.
 
ధోనీకి ఒక అద్భుతమైన 'ఫినిషర్‌'గా పేరుంది. అంటే చివరి ఓవర్లలో లక్ష్యాన్ని చేజ్ చేసేటపుడు చాలా సార్లు సత్తా చూపాడు. వేగంగా పరుగులు చేస్తూ జట్టును గెలుపు ముంగిట వరకూ తీసుకొచ్చేస్తాడు. కానీ అంత మాత్రాన, ఒక పెద్ద టార్గెట్ ఉన్న మ్యాచ్‌లో ప్రారంభం చెత్తగా ఉన్నప్పుడు, ఎంత మంచి ఫినిషర్ అయినా చివరి ఐదు ఓవర్లలో ఆ లోటును భర్తీ చేయలేడు. చివరి ఐదు ఓవర్లలో భారత్ విజయానికి 71 పరుగులు అవసరం అయ్యాయి. అంటే ప్రతి బంతికీ రెండుకు పైగా కొట్టాలి. అది అంత సులభం కాదు.
 
ధోనీ ఎందుకు లక్ష్యం అయ్యాడు
అఫ్గానిస్తాన్ మ్యాచ్ నుంచీ ధోనీపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. అందులో భారత్ దాదాపు ఓటమి అంచులదాకా వెళ్లింది. అప్గానిస్తాన్‌పై ధోనీ 52 బంతుల్లో 28 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. కానీ ఆ మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ మినహా ప్రతి ఆటగాడూ చెత్తగానే ఆడాడు. రోహిత్ శర్మ 10 బంతులకు ఒకే ఒక్క పరుగు చేసి ఔటయ్యాడు.
 
అటు వెస్టిడీస్‌తో ఆడిన మ్యాచ్‌లో కూడా ధోనీ ఇన్నింగ్స్ గురించి విమర్శలు వస్తున్నాయి. అప్పుడు ధోనీ 61 బంతుల్లో 56 రన్స్ చేశాడు. అదే మ్యాచ్‌లో రోహిత్ శర్మ 23 బంతులకు 18 రన్స్ చేసి ఔటయ్యాడు. కెప్టెన్ కోహ్లీ 82 బంతులు ఆడి 72 పరుగులు చేశాడు. పాకిస్తాన్‌లో ధోనీపై విమర్శలు రావడానికి కారణం ఉంది. ఇంగ్లండ్ విజయంతో సెమీ ఫైనల్‌లో చేరడం వాళ్లకు ఇప్పుడు అంత సులభం కాదు. ఇంగ్లండ్ గెలుపుతో పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో నాలుగు నుంచి ఐదో స్థానానికి జారింది.
 
పాకిస్తాన్‌కు 8 మ్యాచుల్లో మొత్తం 9 పాయింట్లు ఉంటే ఇంగ్లండ్‌కు 8 మ్యాచుల్లో 10 పాయింట్లు ఉన్నాయి. రెండింటికీ ఒక్కో మ్యాచ్ మిగిలుంది. పాకిస్తాన్ తన తర్వాత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై కూడా గెలిస్తే, దాని మొత్తం పాయింట్లు 11 అవుతాయి. ఇంగ్లండ్ తన తర్వాత మ్యాచ్‌లో గెలిస్తే దాని మొత్తం పాయింట్లు 12 అవుతాయి. అదీ పాక్ కోపం...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆ విషయంలో పంతం నెగ్గించుకున్న ఆర్కే రోజా...