శ్రీకాళహస్తి పట్టణం సన్నిధి వీధిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఈనెల 29న (గురువారం) హీరో శ్రీకాంత్ కుటుంబం నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారు. ముక్కంటి ఆలయంలో పనిచేసే కొందరు అర్చకులు, వేద పండితులు శ్రీకాంత్కు ప్రైవేటుగా పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
శ్రీకాళహస్తి ఆలయ అర్చకులు బయట ఎక్కడా కూడా ఇలాంటి పూజలు చేయకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. అలా కాకుండా ప్రైవేటుగా ఇలాంటి పూజలు చేసినప్పుడు సదరు అర్చకులపై దేవాదాయ శాఖ చట్టం ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేటుగా నవగ్రహ శాంతి పూజలు నిర్వహించిన వ్యవహారంపై శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడిపై ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే, ఆలయ అధికారులు విచారణ జరిపి, సంబంధిత వేద పండితుడిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
కాగా.. సినీ సెలబ్రేటీలతో పాటు ప్రముఖ క్రికెటర్లు, దిగ్గజ వ్యాపారులు శ్రీకాళహస్తిలో తరుచు శాంతి పూజలు, దోష నివారణ పూజలు జరిపిస్తుంటారు. ఇందుకోసం వారికి దేవాలయం పరిధిలోనే ఏర్పాట్లు చేస్తుంటారు. అయితే ఆలయ నిబంధనల మేరకు ప్రైవేటుగా, ఆలయం వెలుపల పూజలకు నిషిద్దం.