Publish Date: Sat, 24 Nov 2018 (09:31 IST)
Updated Date: Sat, 24 Nov 2018 (09:32 IST)
తాను సాగిస్తున్న ప్రజా పోరాట యాత్రలో తనకు లేదా తన పార్టీ జనసైనికులకు ఏమైన జరిగితే దానికి డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి ఎలాగూ బాధ్యత లేదని.. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత డీజీపీకి ఉందని గుర్తుచేశారు.
'ఇటీవల రాజానగరం సభకు వెళ్లి వస్తుంటే మా సెక్యూరిటీ సిబ్బంది ప్రయాణించే కారును ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. మా పార్టీ నేత నాదెండ్ల మనోహర్ హైదరాబాద్లో ఇంటికి వెళ్లే సమయంలో ఇసుక లారీ ఆయన కారును ఢీకొట్టింది. కోడికత్తి విషయంలో స్పందించిన ప్రభుత్వం నా విషయంలో ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
నిజానికి నాదెండ్ల మనోహర్కు అంగరక్షకులను ఇవ్వాలని నెల కిందట రాష్ట్ర డీజీపీకి లేఖ రాశాం. ఇప్పటివరకూ ప్రభుత్వం స్పందించ లేదని ఆరోపించారు. సత్తా, సమర్థత లేని చంద్రబాబు పాలన కావాలా.. బాధ్యత లేకుండా రోడ్లపై తిరిగే జగన్ కావాలా.. రూ.100 కోట్ల ఆదాయాన్ని వదిలిపెట్టి మీకోసం రోడ్లపైకి వచ్చిన తాను కావాలో మీరే నిర్ణయించుకోవాలని ప్రజలకు పవన్ విజ్ఞప్తి చేశారు.