Publish Date: Tue, 19 May 2020 (05:32 IST)
Updated Date: Tue, 19 May 2020 (05:34 IST)
ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి, నివారణ, సహాయక చర్యల తీరుతెన్నులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన సరికొత్త మార్గదర్శకాలపైనా ఆయన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలు చేయాల్సిన మార్గదర్శకాలను వివరించారు.
కారులో ముగ్గురికి మాత్రమే ప్రయాణానికి అనుమతి ఉంటుందని తెలిపారు. పెళ్ళిళ్ళు వంటి కార్యక్రమాలకు 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. రెస్టారెంట్లలో భోంచేయడం వీలుకాదని, రెస్టారెంట్ల నుంచి పార్శిల్ తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నామని, అది కూడా భౌతికదూరం పాటిస్తూ పార్శిల్ తీసుకెళ్లాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఇక, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వెల్లడించారు. దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచేందుకు అనుమతిస్తున్నామని తెలిపారు.