Publish Date: Tue, 08 Sep 2020 (20:00 IST)
Updated Date: Tue, 08 Sep 2020 (20:01 IST)
ప్రముఖ సినీ నటుడు జయప్రకాశ్ రెడ్డి(74) మరణం పట్ల ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జయ ప్రకాశ్ రెడ్డి తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారని .. తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారన్నారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి అని ట్వీట్ చేశారు ప్రధాని మోడీ.
మంగళవారం తెల్లవారు జామున గుండె పోటుతో బాత్ రూమ్లోనే కుప్పకూలిన జయప్రకాశ్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. కరోనా మహమ్మారి క్రమంలో సినిమా షూటింగ్లు లేకపోవడంతో ప్రస్తుతం ఆయన గుంటూరులో నివాసం ఉంటున్నారు.
ఆయన మృతిపట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.