Publish Date: Thu, 03 Sep 2020 (21:04 IST)
Updated Date: Thu, 03 Sep 2020 (21:05 IST)
పెద్ద నోట్ల రద్దంటే దేశంలోని పేదలపై దాడి చేయడమని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు. పేదలతో పాటు అసంఘటిత రంగంపై కూడా దాడికి దిగినట్లేనని ఆయన ఆరోపించారు.
500 రూపాయల నోట్లు, 1,000 నోట్ల రద్దుతో చిరు వ్యాపారులు, రైతులు, అసంఘటిత కార్మికులు ఎలా నష్టపోయారో ట్విట్టర్ వేదికగా వీడియో ద్వారా వివరించారు.
ప్రధాని మోదీ ‘నగదు రహిత భారత్’ అని నినాదమిచ్చారని, అది కాస్తా.. ‘‘కార్మిక రహిత, రైతు రహిత, చిన్న వ్యాపార రహిత భారత్’ గా మారిపోయిందని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దు తన లక్ష్యాన్ని చేరుకోవడంలో పూర్తిగా విఫలమైందని, నల్లధనాన్ని వెలికితీయడంలో కూడా విఫలమైందని ఆయన మండిపడ్డారు.
ఆ నిర్ణయం దేశంలోని పేదల్లో ఏ రకమైన మార్పూ తీసుకురాలేదని పేర్కొన్నారు.మోదీ ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు కేవలం ధనవంతులకు మాత్రమే ఉపయోగపడిందని, వారి రుణాలు మాఫీ కావడానికి మాత్రమే ఉపయోగపడిందని మండిపడ్డారు.
పేదల జేబులోని డబ్బు, బడా వ్యాపారుల అప్పులు మాఫీ చేయడానికి మాత్రమే ఉపయోగపడిందని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.