Publish Date: Wed, 30 Oct 2019 (06:03 IST)
Updated Date: Tue, 29 Oct 2019 (23:07 IST)
దక్షిణ మధ్య రైల్వే వేగ నిబంధనలను కనీస స్థాయికి తొలగించి సమయపాలన పెంచి రైల్వే బోర్డ్ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడానికి రైళ్ళ సగటు వేగాన్ని పెంచాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య అధికారులకు సలహా ఇచ్చారు.
సికింద్రాబాద్ రైల్ నిలయంలో మంగళవారం వివిధ విభాగాల ఉన్నతాధికారులతో భద్రత, సమయపాలన మరియు సరకు రవాణా విషయాలపై జరిపిన సమీక్షా సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు మరియు నాందేడ్ డివిజన్ల డిఆర్ఎంలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
సిగ్నల్ అండ్ టెలీ కమ్యూనికేషన్స్ వైఫల్యాలు, లోకోమోటివ్ల వైఫల్యాలు మరియు క్యారేజ్ అండ్ వ్యాగన్ వైఫల్యాల వల్ల రైళ్ళ నిర్ణీత రాకపోకలకు కలిగే ఇబ్బందులపై జనరల్ మేనేజర్ సమీక్ష జరిపారు. రైళ్ళ సమయపాలనకు భంగకరంగా పరిణమించే వివిధ రకాల వైఫల్యాలను తగ్గించేందుకు డిఆర్ఎంలు పూనుకొని కాలానుగుణంగా సరైన నిర్వహణ చర్యలను చేపట్టాలని సూచించారు.
అవాంఛనీయ సంఘటనలు సంభవించినప్పుడు సిబ్బంది అప్రమత్తను పరీక్షించడానికి మరియు వారిని హెచ్చరించడానికి షార్ట్ నోటీసులిచ్చి మాక్ డ్రిల్లను నిర్వహించాలని ఆయన సలహా ఇచ్చారు. స్టేషన్ల నుండి ప్రారంభమయ్యే అన్ని రైళ్ళలో బయో టాయిలెట్లను డిసెంబర్ చివరిలోగా ఏర్పాటు చేయాలని వర్క్షాప్ అధికారులకు జనరల్ మేనేజర్ గజానన్ మాల్య సూచించారు.
విజయవాడకు వెళ్ళకుండా కొండపల్లి రాయనపాడు స్టేషన్ల ద్వారా వెళ్ళేందుకు నీటి సరఫరా సౌకర్యం కల్పించాలని డివిజనల్ అధికారులకు ఆయన సూచించారు.
సమావేశంలో అదనపు జనరల్ మేనేజర్ బి.బి.సింఘ్, ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎ.ఎ.ఫడ్కే, ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ జాన్ ప్రసాద్, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ కె.శివ ప్రసాద్, ప్రిన్సిపల్ చీఫ్ సిగ్నల్ అండ్ టెలికాం ఇంజనీర్ అరుణ్కుమార్ జైన్, ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వయిజర్ బ్రజేంద్రకుమార్, ప్రిన్సిపల్ చీఫ్ మెటీరియల్ మేనేజర్ వి.ఆర్.మిశ్రా, ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ టి.జె.ప్రకాష్, ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమీషనర్ జి.ఎం.ఈశ్వరరావ్ పాల్గొన్నారు.