Publish Date: Sun, 24 Apr 2022 (11:33 IST)
Updated Date: Sun, 24 Apr 2022 (11:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి పాలనలో సర్వం నాశనమైందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఒక్క అభివృద్ధి పనికి బ్రేకులు పడ్డాయన్నారు. దీంతో ప్రాజెక్టు పనులపై నీలి నీడలు కమ్ముకున్నాయన్నారు. పోలవరం పనులు ఎందుకు కొనసాగించడం లేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల వద్ద 144 సెక్షన్ ఎందుకు అమలు చేస్తున్నారంటూ ఆయన నిలదీశారు.
పాత పథకాలకు ఏపీ సీఎం జగన్ పేర్లు మార్చి మంచి కలరింగ్ ఇస్తున్నారంటూ మండిపడ్డారు. వాటిని జగన్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలుగా తాడేపల్లి ప్యాలెస్లో మీటలు నొక్కడం, గొప్పలు చెప్పుకోవడగానికే సమయమంతా సరిపోయిందన్నారు.
ముఖ్యమంత్రి జగన్తో పాటు ఏపీ మంత్రులకు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ఏమాత్రం అవగాహన లేదని ఆయన విమర్శించారు. కేవలం ఓట్ల కోసం మాత్రమే జగన్ ఆలోచన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంతటి అవినీతి, అసమర్థ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరనే విషయాన్ని ప్రజలు గ్రహించారని ఆయన అన్నారు.