Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో మరో కోర్టు ధిక్కరణ కేసు - డీఎంఈకి 3 నెలల జైలు

ఏపీలో మరో కోర్టు ధిక్కరణ కేసు - డీఎంఈకి 3 నెలల జైలు
, ఆదివారం, 24 ఏప్రియల్ 2022 (11:14 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో కోర్టు ధిక్కరణ కేసులతో కోర్టు బోనెక్కుతున్నారు. ఇప్పటికే ఎనిమిది ఐఏఎస్‌లు కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు తగిన శిక్షలు విధించింది. ఈ  శిక్షలపై హైకోర్టు ధర్మాసనం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. తాజాగా కోర్టు ధిక్కరణ కింద ఏపీ వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రాఘవేంద్ర రావుకు ఏపీ హైకోర్టు మూడు నెలల జైలుశిక్షతో పాటు 2 నెలలో జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. 
 
అయితే, ఈ కేసులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్ష అమలును మాత్రం మరోవారం రోజుల పాటు వాయిదా వేసింది. ఈ గడువులోగా తీర్పుపై అప్పీలు చేసుకోకపోయినా, వేసిన తర్వాత శిక్షా తీర్పుపై స్టే లభించకున్నా ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు హైకోర్టు రిజిస్ట్రార్ జ్యూడిషియల్ ఎదుట లొంగిపోవాలని, ఆ తర్వాత జైలుకు తరలించాలని ఆదేశించింది. 
 
ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే, కర్నూలు వైద్య కళాశాలలో 2018-19 సంవత్సరానికి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా లేనప్పటికీ కళాశాల నుంచి ఆ ఏడాది ముగ్గురు వైద్యులు పదోన్నతి కౌన్సెలింగులో పాల్గొన్నారు. అసోసియేట్ ప్రొఫెసర్లుగా ఇతర కళాశాలలకు వెళ్లేందుకు అంగీకరించారు.
 
అయితే, అంగీకరించిన స్థానాలకు వెళ్లకుండా కర్నూలు వైద్య కళాశాలలోనే కొనసాగారు. ఆ తర్వాత అదే కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులకు ఖాళీలు ఏర్పడగా ఆ ముగ్గురినీ నియమిస్తూ 10 అక్టోబరు 2020న డీఎంఈ ఉత్తర్వులు ఇచ్చారు. 
 
కర్నూలు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు అయిన డాక్టర్ సి.సునీత, డాక్టర్ ఎ.సుధారాణి డిసెంబరు 2020లో హైకోర్టును ఆశ్రయించారు. వారు పదోన్నతి పొందినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే అంగీకరించిన స్థానాలకు వెళ్లలేదని, ఫలితంగా ఆ పోస్టులకు అర్హులమైన తాము నష్టపోయామని పిటిషన్‌లో పేర్కొన్నారు. 
 
ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం డీఎంఈ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. అయినప్పటికీ ఆ ముగ్గురూ ఇంకా అక్కడే కొనసాగుతుండడంతో సునీత, సుధారాణి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. విచారించిన న్యాయస్థానం డీఎంఈ డాక్టర్ రాఘవేంద్రరావు కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడినట్టు నిర్ధారించి మూడు నెలల జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నైజీరియాలో భారీ పేలుడు - 100 మంది మృతి