Publish Date: Sat, 30 Mar 2019 (17:31 IST)
Updated Date: Sat, 30 Mar 2019 (17:33 IST)
ఇటీవల వైకాపా తీర్థం పుచ్చుకున్న సినీ నటుడు డాక్టర్ మోహన్బాబు ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మాటల తూటాలు పేల్చారు. చంద్రబాబు పునాది కాంగ్రెస్ పార్టీలో ఉందన్నారు. పైగా, చంద్రబాబు కంటే తానే టీడీపీలో సీనియర్ అని చెప్పారు. ఈ ఎన్నికలతో టీడీపీ ఇకపై ఉండదని ఆయన జోస్యంచెప్పారు.
ఆయన శనివారం విజయవాడలోని వైకాపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, గతంలో ఎన్టీఆర్పై చంద్రబాబు పోటీ చేస్తానని చెప్పారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు లాక్కున్నారన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అమాయకులని, వారిని నమ్మించి మోసం చేశారని ఆరోపించారు. ఇపుడు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు.
చంద్రబాబుది కుటుంబ పాలన అని చెప్పారు. చంద్రబాబు మాటలు వింటే ఎవరైనా మునగాల్సిందేనన్నారు. అందువల్ల జగన్ మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్సివ్వాలని, ఆయన తనకు కూడా పరిపాలనా అనుభవం ఉందని నిరూపించుకుంటాడని అన్నారు. చంద్రబాబు దోచుకోవడానికి చివరకు ఇసుకను కూడా వదిలిపెట్టలేదని మోహన్ బాబు ధ్వజమెత్తారు.