Publish Date: Tue, 16 Apr 2019 (18:28 IST)
Updated Date: Tue, 16 Apr 2019 (18:37 IST)
ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు నీటి ముప్పు రాబోతోంది. తిరుమల గిరుల్లో ఉన్న జలాశయాల్లో నీరు రోజురోజుకూ అడుగంటుతోంది. దీంతో తిరుమలలో నీటి సమస్య మొదలవుతోంది. నిజానికి తిరుమలలో భక్తుల దాహార్తిని తీర్చేందుకు పసుపుధార, కుమారధార, పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ డ్యామ్లు ఉన్నాయి. వీటి నుండే తిరుమలలోని అన్ని అవసరాలకు నీటిని ఉపయోగిస్తుంటారు.
అయితే గతేడాది శేషాచలం కొండల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో జలశయాలు పూర్తి స్థాయిలో నిండలేదు. ఇప్పటికే ఆకాశగంగ, గోగర్భం డ్యామ్లు ఎండిపోయినట్లు తితిదే అధికారులు చెప్తున్నారు. పసుపుధార, కుమారధార మరియు పాపవినాశంలో మాత్రమే ప్రస్తుతం నీరు అందుబాటులో ఉంది.
వీటిలోని నీరు కూడా మూడు నుండి నాలుగు నెలలు మాత్రమే సరిపోతాయట..దీంతో నీటి పొదుపు చర్యలను చేపట్టింది తితిదే. అందులో భాగంగానే స్థానికంగా ఉండే బాలాజీనగర్లో ఐదురోజులకొకసారి, అలాగే హోటళ్లు, మఠాలకు రోజుకు రెండు పూటలకు కలిపి 8 గంటలపాటే నీటిని సరఫరా చేస్తున్నారు. అలాగే అద్దె గృహాలు, మరుగుదొడ్లలో సైతం తక్కువ నీటిని వినియోగించేటట్లు చర్యలు చేపట్టారు.
గతంలో నీటి సమస్యను తట్టుకోవడానికి తెలుగుగంగలో నుండి నీటిని తిరుపతి తిరుమలకు నీటిని సరఫరా చేసారు. ఈసారి కూడా ఇలా చేసేందుకు వారు ఆలోచిస్తున్నారు. మరోవైపు వర్షాలు కురవాలని వరుణయాగం చేపట్టాలని తితిదే ఆలోచన చేస్తోంది. ఇందుకోసం తితిదే వారు కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతిని సంప్రదించి సలహా తీసుకోనున్నారు.
మోహన్
Publish Date: Tue, 16 Apr 2019 (18:28 IST)
Updated Date: Tue, 16 Apr 2019 (18:37 IST)