Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సహజ శిలా వెంకన్న శిల్పానికి మేలు చేస్తున్నామా...? కీడు చేస్తున్నామా...?

సహజ శిలా వెంకన్న శిల్పానికి మేలు చేస్తున్నామా...? కీడు చేస్తున్నామా...?
, మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (20:51 IST)
పర్వతాల్లో సహజ శిలారూపాలు వెలియడం చాలా అరుదు. ఎన్నో కోట్ల సంవత్సరాలుగా పర్వత పవన క్షోభ్యత వల్ల ఇలాంటి అరుదైన సహజ శిలా రూపాలు ఏర్పడుతాయి. ప్రస్తుతం ప్రపంచంలో ఇలాంటి సహజ శిలారూపాలు చాలాచోట్ల ఉన్నాయి. మన తిరుమలలోనూ అనేక చోట్ల సహజ శిలారూపాలు ఏర్పడ్డాయి. అయితే రెండో ఘాట్ రోడ్డులోని చివరి మలుపు వద్ద ఉన్న వెంకన్న స్వామి రూపం అత్యభ్యుతం. ఈ సహజ శిలారూపం ఏర్పడిన తీరు వర్ణించడానికి వీలుపడదు. ప్రపంచంలోనే ప్రకృతి చెక్కిన అరుదైన శిల్పాల లిస్టు తయారుచేస్తే మన సహజ వెంకన్న స్వామి శిల్పమే ముందు వరుసలో ఖచ్చితంగా ఉంటుంది. ముఖ కవలికలు సైతం చక్కగా కలిగిన ఏకైక సహజ శిలరూపంగా మన వెంకన్న శిల్పమే ఉండవచ్చు. 
 
తిరుమలలో ఇలాంటి శిల్పం చూసి మనం సమ్మోహనం చెందాము, అన్నమాచార్యులు చెప్పినట్టు తిరుమల గిరుల్లో వెతకాలే గానీ అంతటా  వెంకన్నే ఉన్నారనడానికి ఈ ఒక్క శిల్పమే సాక్షంగా మనం తన్మయత్వం చెందాము. ఈ సహజ శిలారూపానికి పూజలు చేయడం ప్రారంభించాము. తొలుత ఒరిద్దరితో ప్రారంభమైన పూజలు ఇప్పడు ఇంకొంతమంది చెయ్యడం ప్రారంభించారు. దీనికి ప్రచారం కూడా ఎక్కువవుతుంది. మనం భక్తి పేరుతో ఈ సహాజ కళాకండంపై పాలు పోస్తున్నాం, పసుపుకుంకుమ వేస్తున్నాం, ఇక అభిషేకం పేరుతో పూజాద్రవ్యాలు ఈ అరుదైన ప్రకృతి శిల్పంపై కుమ్మరిస్తున్నాం. ఇక చివరగా ఓ పెద్ద బిందెల మాల ఈ శిల్పానికి అలంకరిస్తున్నాము.
 
అరుదైన సహజ శిలా వెంకన్నకి పూజలు చేయడం కూడా తప్పేనా అని మీరు అనుకోవచ్చు... పూజ చేయడం తప్పు కాదు కానీ మీరు చేస్తున్న పూజా పద్దతి ముమ్మాటికి  తప్పే. ఏడాదికి ఒకటిరెండు సార్లేగదా పూజ చేసేదని మీరు అనుకోవచ్చు. అయితే మీరు చేస్తున్న ఈ పూజల వల్ల మన సహజ శిలా వెంకన్న రూపమే కనుమరుగయ్యే ప్రమాదంలో పడిపోనుంది.
 
ఇందుగలదు అందులేదని సందేహం వలదు ఎందెందు వెతికినా అందందు కలదు కల్తీ" అన్న రోజుల్లో మనం బ్రతుకుతున్నాము. నేడు ప్రతీ వస్తువు కల్తీమయం ఇప్పుడు పాలల్లో కల్తీ, పసుపులో కల్తీ, చివరికి కుంకుమ కూడా కెమికల్స్‌తో తయారవుతుంది. పాలవ్యాపారుల కక్కుర్తీ వల్ల పాలల్లో ఆక్సిటోసిన్ నిల్వలు పెరుగుతున్నాయి. ఇలాంటి పదార్థాలతో సహజ శిలారూపాన్ని అభిషేకం చేయడం వల్ల ఈ శిలలపై కెమికల్ రియాక్షన్ జరుగుతుంది. దీనివల్ల శిలల మధ్య పటుత్వం  కోల్పోయి, మన సహజ శిలా వెంకన్న ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉంది. 
 
ఇక మనం వేస్తున్న పూలు, బిందెల మాలల వల్ల ఈ శిలాఖండంపై బరువు పెరుగుతుంది. కనీసం  గుండుసూది బరువు కూడా పెట్టకూడని సహజ శిల్పంపై కేజీల కొద్దీ బరువు పెంచుతున్నాం. మరిప్పుడు చెప్పండి మనం సహజ శిలా వెంకన్న శిల్పానికి మేలు చేస్తున్నామా...? కీడు చేస్తున్నామా...?
 
ఇలాంటి అద్బుతమైన సహజ శిలాఖండాలకు దూరం నుంచే పూజలు చేసుకోవడం మంచిది. ఇది కుదరదు అనుకుంటే చక్కగా నీళ్లతోనే అభిషేకం చేసి ఓ చోట చిన్ని బొట్లు పెట్టుకుని, ఈ శిలారూపానికి దూరంగా వచ్చి పుష్పాలు,  నైవేద్యాలు పెట్టి  మన పూజలు చేసుకుంటే,  మన సహజశిలా వెంకన్నను మనం కాపాడుకున్న వారవుతాము. ఇప్పటికే 150 కోట్ల సంవత్సరాల వయస్సున్న ఈ సహజ కళాఖండాన్ని  మరికొన్ని లక్షల సంవత్సరాలు కాపాడిన వారమవుతాము.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాస్తు ప్రకారం ఇంట్లో ఎలా ఉండాలంటే..?