ఉదయం పూట నిద్రలేవగానే ఇలా చేస్తున్నారా?
ఉదయం పూట నిద్రలేవగానే మంచం నుంచి కిందికి దిగి భూమాతను నమస్కరించుకుని ఈశాన్యం వైపు నడవాలి అంటున్నారు వాస్తు నిపుణులు. మంచం లేదా పరుపు దిగుతూ.. పాదాన్ని భూమిపై పెట్టేటప్పుడు క్షమించమని భూదేవిని వేడుకుని
Publish Date: Mon, 18 Dec 2017 (14:06 IST)
Updated Date: Mon, 18 Dec 2017 (14:09 IST)
ఉదయం పూట నిద్రలేవగానే మంచం నుంచి కిందికి దిగి భూమాతను నమస్కరించుకుని ఈశాన్యం వైపు నడవాలి అంటున్నారు వాస్తు నిపుణులు. మంచం లేదా పరుపు దిగుతూ.. పాదాన్ని భూమిపై పెట్టేటప్పుడు క్షమించమని భూదేవిని వేడుకుని.. పాదం భూమిపై పెట్టి తర్వాత వంగి రెండు హస్తాలతో భూమిని తాకి కళ్లకు అద్దుకోవాలని వాస్తు నిపుణులు అంటున్నారు.
అలాగే మంచం దిగకముందే ఉదయం నిద్ర లేచి మెలకువ వచ్చిన తర్వాత వెంటనే పక్కపైనుంచి లేవకుండా రెండు నిమిషాలు అలాగే పడుకొని కళ్లుతెరవకుండా మనస్సులో ఈ కలియుగ మహామంత్రాన్ని ఉచ్చరించుకోవాలి.
హరేకృష్ణ! హరేకృష్ణ ! కృష్ణ కృష్ణ ! హరే హరే !!
హరేరామ ! హరేరామ ! రామరామ ! హరే హరే!! ఈ మంత్రాన్ని లేదా ఇష్ట దైవాన్ని స్మరించుకుంటూ ఉచ్చరించుకోవాలి. తర్వాత అరచేతులను చేర్చి మొహాన్ని స్పృశించుకుని.. కళ్లెదురుగా చేతిని తెచ్చుకుని.. కళ్లు తెరచి.. ఆ అరచేతుల వైపు చూసుకుంటూ
శ్లో|| కరాగ్రే వసతేలక్ష్మీః కరమధ్యే సరస్వతి !
కరమూలే స్థితేగౌరీః కరస్పర్శేన శుభంకురు ||
తాత్పర్యం.. చేతి కొనల యందు లక్ష్మీదేవియు, అరచేతిలో సరస్వతియు, చేతి మొదలు నందు పార్వతి దేవి ఉంటారు. కాబట్టి నిద్రలేచిన తర్వాత మొదటి చూపు తమ అర చేతుల వైపు సారించి ఆ ముగ్గురమ్మలను స్మరించుకుంటే ఆ రోజు శుభకరంగా మారుతుంది.