Publish Date: Tue, 11 Jun 2024 (19:03 IST)
Updated Date: Tue, 11 Jun 2024 (19:05 IST)
హనుమకొండలో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. సోమవారం నాడు ఐదు గంటలకు పైగా నీటిలో కదలకుండా పడి ఉన్న వ్యక్తిని చూసి పోలీసులు, స్థానికులు షాకయ్యారు. నీటిలో ఐదు గంటల పాటు ఉలుకుపలుకు లేకుండా సజీవంగా ఉండటంతో హన్మకొండలోని రెడ్డిపురం కోయిల్కుంట్ల స్థానికులు షాక్కు గురయ్యారు. ఆ వ్యక్తిని గమనించిన స్థానికులు వెంటనే కేయూ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, వారిని ఆశ్చర్యపరిచే విధంగా, చనిపోయినట్లు భావించిన వ్యక్తి, నీటిలో నుండి బయటకు తీసేటప్పుడు కదిలాడు.
సదరు వ్యక్తి నెల్లూరు జిల్లా కావలికి చెందిన కూలీగా గుర్తించారు. స్పృహలోకి వచ్చిన తర్వాత, "నేను ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు గ్రానైట్ క్వారీలో పని చేస్తున్నాను. ఎండ వేడిని తట్టుకోలేక.. నీటిలో ఐదు గంటల పాటు అలానే పడుకుని వుండిపోయానని చెప్పాడు. ఆతని సమాధానం విని పోలీసులతో పాటు ప్రజలు కూడా అవాక్కయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.