Publish Date: Tue, 23 Apr 2019 (19:58 IST)
Updated Date: Tue, 23 Apr 2019 (20:00 IST)
ఈవీఎంల పనితీరుపై మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 10 కోట్లిస్తే చాలు ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చని షాకింగ్ న్యూస్ చెప్పారు. రష్యాలోని కొందరు వ్యక్తులకు ఈ పవర్ వున్నదనీ, డబ్బిస్తే ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా ఈవీఎంలను హ్యాక్ చేసి అభ్యర్థులను గెలిపించేస్తారంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారం రేపుతున్నాయి.
కాగా తనదాకా వచ్చిన ఈ సమాచారంలో ఎంతవరకు నిజం ఉందనేది నిగ్గు తేల్చాలంటూ డిమాండ్ చేశారు. కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించారు. ఎన్నికల పర్యటన ముగిసిన అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ... ఎన్నికల సంఘం, ఈవీఎంల పనితీరుపై సంచలన ఆరోపణలు చేశారు.
వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించడం ద్వారా అసలైన లెక్క తేలుతుందనీ, అందువల్ల ఈవీఎంలలో పోలైన ఓట్ల సంగతి అలా వుంచి వీవీప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటూ డిమాండ్ చేశారు. మరి ఆయన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుందో చూడాలి.