Publish Date: Sun, 28 Oct 2018 (13:11 IST)
Updated Date: Sun, 28 Oct 2018 (13:13 IST)
ఆపరేషన్ గరుడ పేరుతో సంచలన విషయాలు వెల్లడిస్తున్న టాలీవుడ్ హీరో శివాజీ ఇపుడు మరో ఆసక్తికర వార్త చెప్పారు. జగన్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారంటూ వ్యాఖ్యానించారు.
తాజాగా ఓ ఛానల్లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, తాను ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పినట్టుగా మాట్లాడుతున్నాననే భావన వైకాపా నేతలు, కార్యకర్తల్లో ఉందన్నారు.
కానీ, వాస్తవం అది కాదన్నారు. ప్రజల కోసం జగన్ చాలా కష్టపడుతున్నారని.. ఏదో ఒక రోజు ఆయన ముఖ్యమంత్రి అవుతారని శివాజీ జోస్యం చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనే తన లక్ష్యమన్న శివాజీ, తాను ఏ పార్టీకి చెందినవాడినికానన్నారు. గతంలో తాను సీఎం చంద్రబాబును కూడా విమర్శించానన్నారు.
ఆ సమయంలో వైసీపీ నేతలు తనను సంప్రదించారని, తమతో కలసి రావాలని అడిగారని వెల్లడించారు. వైసీపీలో ఎప్పుడూ దూషణలకు పాల్పడేవారిని పక్కనబెట్టి.. బుగ్గన రాజేందర్ రెడ్డి వంటి వారితో మాట్లాడిస్తే పార్టీకి ప్రయోజనం చేకూరుతుందని ఆ సందర్భంగా వారికి సూచించానని శివాజీ వ్యాఖ్యానించారు.