Publish Date: Thu, 29 Aug 2024 (17:21 IST)
Updated Date: Thu, 29 Aug 2024 (17:23 IST)
సినిమా అవకాశాల కోసం పడక సుఖం ఇవ్వాలని కోరే వారిని చెప్పుతో కొట్టాలని యువతులకు నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి హీరో విశాల్ పిలుపునిచ్చారు. ఆయన గురువారం తన 47వ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అడ్జెస్ట్మెంట్ పేరుతో సినిమా అవకాశాలు ఇస్తామని గాలం వేసేవారు ఎంతటివారైనా చెప్పుతో కొట్టాలని సూచించారు.
చిత్రపరిశ్రమలో అడుగుపెట్టాలని ప్రయత్నించే యువతుల్లో 20 శాతం మందికి మాత్రమే అవకాశాలు లభిస్తున్నాయి. 80 శాతం మందికి అవకాశాలు రావడం లేదు. ఇది విచారించదగిన విషయం. ఔత్సాహిక యువతులు సినిమా అకకాశాలను వెతుక్కుంటూ వెళ్ళే కంపెనీల పూర్వాపరాలను పూర్తిగా తెలుసుకోవాలి. వారు ఎంతో అప్రమత్తం గా ఉండాలి. కేరళ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ హేమ కమిషన్ తరహాలోనే కోలీవుడ్లోనూ నడిగర్ సంఘం ఆధ్వర్యంలో పదితో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇది తన బాధ్యత అన్నారు. అలాగే, పడక సుఖం కోసం పిలిచే వారిపై అపుడే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ పేరుతో సినిమా అవకాశాలు ఇస్తామని ఆశ కల్పించేవారు ఏ స్థాయిలో ఉన్నా.. అలాంటివారిని చెప్పుతో కొట్టాలన్నారు.
కొన్ని ఉప్మా కంపెనీలు సినిమా అవకాశాలు ఇస్తామంటూ కెమెరా చేతపట్టుకుని ఫోటో షూట్లు చేస్తూ, యువతులను వాడుకుని వదిలేస్తున్నాయని, ఇది తమిళ చిత్రపరిశ్రమలోనూ ఉందనే విషయాన్ని అంగీకరిస్తున్నట్టు చెప్పారు. పని చేసే స్థలాల్లో కొందరు నటులు యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని, ఇలాంటి వారికి శిక్ష పడాల్సిందే. అరెస్టు చేసిన వారు కొద్ది రోజుల్లోనే బెయిలుపై రాకుండా చూడాలని, తప్పు చేస్తే శిక్ష తప్పదన్న భయం కలిగించాలన్నారు.