Publish Date: Fri, 20 May 2022 (12:57 IST)
Updated Date: Fri, 20 May 2022 (12:59 IST)
తెలంగాణా రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు బంపర్ ఆఫర్ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ఈ నెల 23వ తేదీ నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
అలాగే, విద్యార్థులు ప్రస్తుతం కలిగివున్న ఉచిత బస్సు పాస్ గడువును జూన్ ఒకటో తేదీ వరకు పొడగిస్తున్నట్టు తెలిపారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టిక్కెట్ లేదా బస్సు పాస్ను చూపించి ఉచితంగా ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి, పరీక్షా కేంద్రం నుంచి ఇంటికి ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.