Publish Date: Wed, 23 Mar 2022 (19:53 IST)
Updated Date: Wed, 23 Mar 2022 (19:57 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ తెరాస ఎమ్మెల్యే పద్మా దేవందర్ రెడ్డికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న కారు గాల్లోకి ఎగిరి అల్లంత దూరనపడింది. అయితే, అదృష్టవశాత్తు ఎమ్మెల్యే పద్మా దేవందర్ రెడ్డికి ఎలాంటి గాయాలు తగలలేదు. మెదక్ జిల్లా పరిధిలోని అక్కన్నపేట్ రైల్వే గేట్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.
మెదక్ పట్టణంలో జరిగిన పలు అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవంలో ఆమె బుధవారం పాల్గొన్నారు. ఆ తర్వాత రామాయంపేటలో జరుగుతున్న ఓ వివాహానికి హాజరయ్యేందుకు కారులో బయలుదేరారు. అయితే, అక్కన్నపేట రైల్వే గేటు వద్దకు చేరేసరికి వెనుక నుంచి వచ్చిన కారు ఎమ్మెల్యే కారును బలంగా ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే కారు భారీ శబ్దంతో అల్లంత ఎత్తున ఎగిరిపడింది. అయతే, అదృష్టవశాత్తు ఎమ్మెల్యే లేదా కారులోని ఇతరులకు ఎలాంటి గాయాలు కాలేదు.