Publish Date: Fri, 17 Jun 2022 (15:40 IST)
Updated Date: Fri, 17 Jun 2022 (16:17 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చాపకింద నీరులా వ్యాప్తిస్తుంది. ఆ రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 28424 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వీరిలో 285మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. వీటిలో అత్యధికంగా 188 మందికి ఈ వైరస్ బారినపడ్డారు.
ఇందులో రంగారెడ్డిలో 54, మేడ్చల్ మల్కాగిరి జిల్లాలో 16 కేసుల చొప్పున నమోదయ్యాయి. అయితే, ప్రజలకు, ప్రభుత్వానికి ఊరట కలిగించే అంశాలేమిటంటే కరోనా మరణాలు లేకపోవడం గమనార్హం. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఈ యేడాది ఫిబ్రవరి తర్వాత కేసుల సంఖ్య 285 దాటడం ఇదే తొలిసారి. ఈ నెల 13న 126 కరోనా కేసులు రాగా, 14న ఒక్కసారిగా డబుల్ సెంచరీ మార్కుని(219) అందుకున్నాయి. ఈ నెల 15న 205 కరోనా కేసులు వచ్చాయి. తాజాగా 300లకు చేరువగా కొవిడ్ కేసులు నమోదవడం టెన్షన్ పెడుతోంది.
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఫోర్త్ వేవ్ భయాలను తలుచుకుని ప్రజలు వణికిపోతున్నారు. కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని చెబుతున్నారు.