Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హోం మంత్రినే అడ్డుకున్న పోలీసులు... ప్రగతి భవన్‌లోకి నో ఎంట్రీ?

హోం మంత్రినే అడ్డుకున్న పోలీసులు... ప్రగతి భవన్‌లోకి నో ఎంట్రీ?
, బుధవారం, 1 ఏప్రియల్ 2020 (19:56 IST)
ఆయన ఓ రాష్ట్రానికి మంత్రి. పైగా హోంశాఖను నిర్వహిస్తున్నారు. అంటే... రాష్ట్ర పోలీసు యంత్రాంగం మొత్తం ఆయన చేతిలో ఉంటుంది. ఆయన కనుసన్నల్లో పనిచేయాల్సివుంటుంది. కానీ, తద్విరుద్ధంగా హోం మంత్రికి పోలీసులు ఝులక్ ఇచ్చారు. ప్రగతి భవన్‌లోకి వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన వెనుదిరిగారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరో కాదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుడిభుజంగా ఉన్న మహమూద్ అలీ. తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి. హైదరాబాద్ పాతబస్తీవాసి. అయితే హోం మంత్రిగా ఉన్న అలీకి తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయమైన ప్రగతి భవన్‌ అడుగుపెట్టనీయకపోవడానికి బలమైన కారణం లేకపోలేదు. 
 
రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల లింకు ఢిల్లీ మర్కజ్‌లో అనుసంధానమైవుంది. ఈ సదస్సుకు వెళ్లి వచ్చిన అనేక మంది ఇస్లాం మతపెద్దలు కరోనా వైరస్‌తో వచ్చి దేశంలోని అనేక ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తికి కారణభూతులయ్యారు. దీంతో మర్కజ్ యాత్రికులను జల్లెడ వేసి గాలిస్తున్నారు. పైగా, పలువురు ఇస్లాం మతపెద్దలు అనుసరిస్తున్న వైఖరి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం మింగుడుపడటంలేదు. 
 
ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌లో కొత్త కేసుల నమోదుతో పాటు మర్కజ్ యాత్రికుల అంశంపై సీఎం కేసీఆర్.. మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఇస్లాం సామాజికవర్గానికి చెందిన అలీని ఈ సమీక్షకు దూరంగా ఉంచారు. పైగా, అలీ పాతబస్తివాసి. ఇదే ప్రాంతానికి చెందిన అనేక మందికి కరోనా వైరస్ సోకివుంది. అందుకే ఆయనను ప్రగతిభవన్‌లోకి అనుమతించలేదన్న వాదన లేకపోలేదు. 
 
ఇక్కడో విషయాన్ని గుర్తించాలి. మహమూద్ అలీ పోలీసులకు బాస్. ఆయన పరిధిలో పనిచేసే సిబ్బందే ఆయనకు అడ్డకట్ట వేయడం గమనార్హం. అయితే సీఎం నిర్వహిస్తున్న సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. మర్కజ్ యాత్రికులను గుర్తించాలని, అందుకు సంబంధించిన అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. యాత్రలో పాల్గొన్న వారిని ఎంతమందిని గుర్తించారు. గుర్తించినవారిలో క్వారంటైన్‌కు తరలించారా? పాజిటివ్ కేసులు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్ డౌన్ లోనూ వీడని సంకల్పం: ఆంధ్రప్రదేశ్ లో 52,49,802 మందికి పెన్షన్ల పంపిణీ