Publish Date: Sun, 06 Mar 2022 (10:40 IST)
Updated Date: Sun, 06 Mar 2022 (10:42 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభత్వంపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం ఆయన దేశంలోని కాంగ్రేస్సేతర విపక్ష పార్టీలను ఏకతాటిపైకి తెచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఇప్పటికే పలువురు విపక్ష నేతలను కలుసుకున్నారు. అయితే ఇపుడు మరో అడుగు ముందుకేసి ఈ నెల 12, 13 తేదీల్లో రైతు సంఘాలతో జాతీయ స్థాయిలో ఓ సదస్సు నిర్వహించాలని భావిస్తున్నారు. రైతు సంఘం నేత టికాయత్ కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
అలాగే, ఈ నెల మూడో వారంలో విద్యుత్ సంఘాలతో ఆయన సమావేశంకానున్నారు. విద్యుత్ శాఖను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 28, 29 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు సమ్మెబాట పట్టనున్నాయి. విద్యుత్ మీటర్ల బిగింపునకు వ్యతిరేకంగా ఏప్రిల్ నెలలో భారీ సభ నిర్వహించాలన్న యోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారు. అయితే, కేంద్రానికి, ప్రధాని మోడీకి వ్యతిరేకంగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన యుద్ధంంలో ఏ మాత్రం సఫలీకృతులవుతారో వేచిచూడాల్సిందే.