తెలంగాణలో రైతు బంధు పథకం... పెద్ద డ్రామా అంటున్న కాంగ్రెస్ నేతలు..!
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 10 నుంచి రైతు బంధు పథకం ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కింద ఎకరాకు రూ.4 వేలు పెట్టుబడి సాయంగా ఇవ్వనున్నారు. ప్రభుత్వం అందించే ఈ చెక్కులపై లబ్దిదారుల పేరు, పాస్బుక్ యూనిక్ ఐడీ, రైతు గ్రామం, మండలం, జిల్లాల పేర్లు ఉంటాయి. కరీంనగర్
Publish Date: Wed, 09 May 2018 (22:16 IST)
Updated Date: Wed, 09 May 2018 (22:20 IST)
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 10 నుంచి రైతు బంధు పథకం ప్రారంభిస్తున్నారు. ఈ పథకం కింద ఎకరాకు రూ.4 వేలు పెట్టుబడి సాయంగా ఇవ్వనున్నారు. ప్రభుత్వం అందించే ఈ చెక్కులపై లబ్దిదారుల పేరు, పాస్బుక్ యూనిక్ ఐడీ, రైతు గ్రామం, మండలం, జిల్లాల పేర్లు ఉంటాయి. కరీంనగర్లోని హుజురాబాద్లో లక్షమంది రైతుల సమక్షంలో ఈ నెల 10న ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. మరోవైపు ఉదయం 11.15 గంటలకు అన్ని జిల్లాల్లో మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
తెలంగాణ వైద్యారోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి లక్ష్మారెడ్డి.. మహబూబ్నగర్, వనపర్తి జిల్లాల్లో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డితోపాటు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలం కాట్రేవ్పల్లిలో రైతాంగానికి రైతు బంధు పథకం పాసు పుస్తకాలు-చెక్కుల పంపిణీ చేస్తారు.
అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్టలో రైతాంగానికి రైతు బంధు పథకం పాసు పుస్తకాలు-చెక్కుల పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొంటారు.
రైతు బంధు పథకం ప్రారంభం కాకముందే కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. రైతుబంధు పథకం పెద్ద డ్రామా అని టీపీసీసీ జనరల్ సెక్రటరీ దాసోజ్ శ్రవణ్ ఆరోపించారు. సెక్యూరిటీ ఫీచర్స్ లేకుండా కొత్త పాస్ పుస్తకాలను ప్రింట్ చేస్తున్నారని, రైతుల పేరిట వందల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.