Publish Date: Wed, 14 Jul 2021 (21:28 IST)
Updated Date: Wed, 14 Jul 2021 (21:31 IST)
రోడ్ల మీద ఏర్పడే ప్రమాదకరమైన గుంతలను పూడ్చే పనిని స్వచ్ఛందంగా చేపట్టిన కే. గంగాధర్ తిలక్ను గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఈరోజు రాజ్ భవన్లో సత్కరించారు. ప్రమాదాలను నివారించడానికి, జీవితాలను కాపాడడానికి రోడ్లపై గుంతలు పూడ్చడమే లక్ష్యంగా చేసుకొని సొంత ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని గత దశాబ్ద కాలం పైగా గంగాధర్ చేపట్టడం అభినందనీయమని గవర్నర్ అన్నారు.
గంగాధర్ను "రోడ్ డాక్టర్"గా గవర్నర్ అభివర్ణించారు. గంగాధర్, ఆయన భార్య వెంకటేశ్వరి స్వచ్ఛందంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో స్ఫూర్తిదాయకం అని గవర్నర్ అన్నారు. గంగాధర్ను, ఆయన భార్యను మన కాలం "అన్ సంగ్ హీరోస్"గా గవర్నర్ కొనియాడారు. రోడ్లపై జరుగుతున్న కొన్ని ప్రమాదాలను చూసి చలించిన గంగాధర్ దంపతులు ఈ కార్యక్రమాన్ని చేపట్టి గత దశాబ్ద కాలంగా నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు.
ఇంత వయసులో, ఇంత ఓపికగా, సొంత ఖర్చుతో రోడ్లపై గుంతలు పూడ్చడం ఒక ఉద్యమంగా చేపట్టిన గంగాధర్ దంపతులు అందరికీ స్ఫూర్తిదాయకం అని డాక్టర్ తమిళిసై అన్నారు.
గవర్నర్ డాక్టర్ తమిళిసై ఈ దంపతులకు శాలువా, జ్ఞాపికలు బహూకరించి రాజ్ భవన్ దర్బార్ హాల్లో ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సెక్రెటరీ కే సురేంద్రమోహన్, జాయింట్ సెక్రటరీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.