Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తలసాని

ప్రజాసంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తలసాని
, శనివారం, 15 ఆగస్టు 2020 (21:11 IST)
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని, డెబ్బై నాలుగేళ్ళలో జరగని అభివృద్ది కేవలం ఆరేళ్ళలో జరుగుతుదని ఈ విషయంలో దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటుందని రాష్ట్ర  పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రమైన మెదక్లోని కలెక్టరేట్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గత డెబ్బై నాలుగు సంవత్సరాల్లో జరగని అభివృద్ది కేవలం ఆరేళ్ళ కాలంలో జరిగిందన్నారు.

మెదక్ జిల్లా అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని ఈ విషయలో ప్రజలు సంతోషంగా ఉన్నారని... రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఒక వైపు అభివృద్ది, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి వివరించారు. దేశానికి స్వాతంత్ర్య వచ్చి 74 సంవత్సరాలు అయినా... మన రాష్ట్రానికి స్వాతంత్ర్యం వచ్చి ఆరేళ్ళు కావస్తోందని. స్వాతంత్ర్యం కోసం ఎందరో అమరవీరులు త్యాగం చేస్తే... అమరవీరుల త్యాగఫలంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు.

ఆరేళ్ళ కాలంలోనే ఎంతో అభివృద్ది సాధించిన మన రాష్ట్రం వైపు యావత్తు భారతదేశం, ఆయా రాష్ట్రాలు చూస్తూ తెలంగాణ రాష్ట్ర పరిపాలనను ఆదర్శంతంగా చూస్తున్నాయని ఇది ఎంతో గర్వకారణమన్నారు. రాష్ట్రంలో ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడంతో పాటు ఎన్నో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

గతంలో వర్షాల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేదని... ప్రస్తుతం వరుణదేవుడు కరుణించి మంచి వర్షాలు కురుస్తున్నాయని దీంతో తెలంగాణ  వ్యాప్తంగా రైతాంగం ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉందన్నారు. కులవృత్తుల వారిని ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ఆర్థికంగా, సామాజికంగా బాగు చేసేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించామన్నారు.

ఇరిగేషన్ రంగంలో గతంలో ఎంతో వెనుకబడిన మెదక్ జిల్లా ప్రస్తుతం 33 శాతంపెరిగిందని... ఈ విషయంలో ఆ శాఖ అధికారుల పనితీరు ఎంతో బాగుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధనతో పాటు సన్న బియ్యంతో విద్యార్థులకు మంచి భోజనం అందచేస్తున్నామన్నారు.

ప్రభుత్వం చేపట్టిన నియంత్రిత సాగు పట్ల కొందరు రాజకీయ నాయకులు రాద్దాంతాలు చేసినా రైతులు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల నమ్మకంతో ఉండటం ఎంతో గర్హణీయమని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులు తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి అని... ఆయన చేసే పనులన్నీ రైతులను గొప్పవారిని చేయడం కోసమేనని అందరికీ తెలుసునని అన్నారు.

ప్రభుత్వం రైతులను గొప్పవారిని చేయాలని ఎల్లప్పుడూ ఆకాంక్షిస్తూ రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను తీసుకువచ్చిందని... ఈ విషయంలో దేశంలోని చాలా రాష్ట్రాలు ఇదే పద్దతిని పాటించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి తలసాని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ ద్వారా చరిత్రలో నిలిచిపోయే పనులు చేపట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు.

వీటితో పాటు ప్రభుత్వాసుపత్రుల్లో కేసీఆర్ కిట్లను అందచేస్తూ... నార్మల్ డెలివరీలు చేసేలా చూస్తోందన్నారు. గతంలో మాతృమరణాలు ఎక్కువగా ఉండేవని... ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాసుపత్రుల్లోనే సుఖప్రసవాలు జరగడంతో పాటు పుట్టిన బిడ్డకు అవసరమైన వస్తువులను కేసీఆర్ కిట్ల ద్వారా అందచేయడం జరుగుతుందన్నారు.

అలాగే ప్రభుత్వం కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆడపిల్ల పెళ్ళి చేయాలంటే భయపడే రోజులు పోయేలా ఆదుకుంటుందన్నారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రైతుబంధు కింద డబ్బులను వారి వారి ఖాతాల్లోకి జమచేయడంతో పాటు ఒక కోటి రెండు ఎకరాల పంట ధాన్యం కొనుగోలు చేసి ఆ డబ్బులను సైతం అందచేయడం ఎంతో గొప్పవిషయమని మంత్రి శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.

ఈ సంక్షేమ పథకాలు తమ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని తెలియచేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతువేదికల నిర్మాణాలు నెలరోజుల్లో పూర్తవుతాయని... రైతులందరినీ ఒకేచోటకు చేర్చి వారి సాదక బాధకాలు, ఏ పంట వేసుకోవాలనే విషయాలపై చర్చించుకునేందుకు రైతువేదికల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు.

రైతు వేదికలకు రూ.22 లక్షల చొప్పున కేటాయించడం జరిగిందని... ఏడు లక్షల పది వేల మంది రైతులు ఉన్నారని మంత్ర స్పష్టం చేశారు. ఐదు వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించడం జరిగిందని... వీరందరూ రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. దీంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని... వారి అభివృద్దికి అనేక పథకాలు ప్రవేశపెట్టామన్నారు.

కులవృత్తులను బలోపేతం చేసేందుకు మత్స్యకారులకు చేప పిల్లలు, వాహనాలు, గొర్రెల కాపరులకు మేకలు, గొర్రెలు, చేనేత, గీత, రజక, నాయిబ్రాహ్మణులకు అవసరమైన పనిముట్లు అందచేసి వారిని అభివృద్ది పథంలో తీసుకెళ్ళడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వివరించారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం చేపట్టని పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అందరి దృష్టి రాష్ట్రం వైపు చూసేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు.

మెదక్ నుంచి హైదరాబాద్కు వచ్చే రహదారిలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు, చెట్లు పెంచడం వల్ల పచ్చదనంతో కనిపిస్తోందని... ఇది ఎంతో మంచి  పరిణామమన్నారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా వైకుంఠ దామాల నిర్మాణం, ట్రాక్లర్ల పంపిణీ, కరెంట్ సరఫరాలో లోపాలను సరి చేయడం జరిగిందని మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ విధానాన్ని తీసుకురావడం జరుగుతుందన్నారు.

అలాగే ఐటీ, ఇండస్ట్రీస్ సెక్టార్లో ప్రపంచం తెలంగాణ రాష్ట్రాన్ని ధీటుగా ఉందని తెలుసుకోవడం ఎంతో ఆనందకరమన్నారు. గతంలో బెంగుళూరు, మహారాష్ట్రలకు ధీటుగా హైదరాబాద్కు ఐటీ హబ్ పెరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరు ఆనందించాలని మంత్రి అన్నారు. అనంతరం మెదక్ పట్టణంలోని గోసముద్రం చెరువులో చేపపిల్లను వదిలారు.

అనంతరం పట్టణంలో కరోనా ఐసోలేషన్ సెంటర్, చిల్డ్రన్స్ పార్కు వద్ద నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను స్థానిక ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ప్రారంభించారు.

ఆయా కార్యక్రమాల్లో జడ్పీ ఛైర్పర్సన్ హేమలత, మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ నగేష్, జిల్లా ఎస్పీ చందనాదీప్తి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జడ్పీ వైస్ ఛైర్పర్సన్ లావణ్యరెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ చంద్రాగౌడ్, జడ్పీ సీఈవో లక్ష్మీబాయి, పీఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఏవో పరశురామ్ నాయక్, జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజిరెడ్డి, డీఎస్పీ కృష్ణమూర్తి, మెదక్ మున్సిపల్ ఛైర్మన్ టి.చంద్రపాల్, వైస్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కమిషనర్ శ్రీహరి,  కౌన్సిలర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నితిన్ గడ్కరీతో కేశినేని నాని సమావేశం.. ఎందుకో తెలుసా?