Publish Date: Fri, 14 Aug 2020 (18:58 IST)
Updated Date: Fri, 14 Aug 2020 (18:59 IST)
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తానని ఎమ్మెల్సీ డాక్టర్. పండుల రవీంద్రబాబు అన్నారు. రాష్ట్ర శాసన మండలి ఆవరణలో శుక్రవారం శాసన పరిషత్తు అధ్యక్షులు యం.ఎ.షరీఫ్ తన కార్యాలయంలో డాక్టర్. రవీంద్రబాబుతో నూతన ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం రవీంద్రబాబు శాసన మండలి ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఉన్నత చదువును పూర్తిచేసి ఉద్యోగం చేస్తున్న తరుణంలో ఎంపిగా ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కిందని అన్నారు. తనకున్న అనుభవం,ప్రజాసేవను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని మాట ఇచ్చారని గుర్తుచేశారు.
అత్యున్నత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఎం జగన్ తనను ఎంపిక చేసినందుకు తన కుటుంబం తరుపున తన తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎమ్మెల్సీ చేసినందుకు సిఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెడుతూ మండలి లోపల,బయట నమ్మకంగా పని చేస్తానని అన్నారు.
సిఎం జగన్ అడుగు జాడల్లో నడుస్తూ ప్రజలకు సేవచేసి మంచిపేరు తెచ్చుకుంటానని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మండలి ఛైర్మన్ షరీఫ్, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, శాసన మండలి డిప్యూటి సెక్రటరీ విజయరాజు, పలువురు అధికారులు పాల్గొన్నారు.