Publish Date: Thu, 19 May 2022 (16:47 IST)
Updated Date: Thu, 19 May 2022 (17:01 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో పర్యటించిన పవన్.. రైతులు, కౌలు రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పవన్ పర్యటనకు సంబంధించి జనసైనికులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
శుక్రవారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించి పార్టీ కార్యకర్తలను పవన్ కళ్యాణ్ పరామర్శిస్తారు. ఉమ్మడి జిల్లాలోని చౌటుప్పల్, కోదాడల్లో పర్యటించి ప్రమాదంలో మృతి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను పరామర్శిస్తారు. రూ.5లక్షల ఆర్థిక సాయం చెక్కులు వారికి అందజేస్తారు.
ఈ సందర్భంగా మెట్టుగూడ అంబేద్కర్ చౌరస్తా, ఎల్బీ నగర్ మీదుగా చౌటుప్పల్ సమీపంలోని లక్కారం గ్రామంకు పవన్ వెళ్తారు. అక్కడ కొంగర సైదులు కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సాయం అందజేస్తారు. ఆ తరువాత కోదాడ వెళ్తారు. అక్కడ కడియం శ్రీనివాసరావు కుటుంబాన్ని పరామర్శించి పవన్ ఆర్థిక సాయం అందజేయనున్నారు.