Publish Date: Tue, 31 Aug 2021 (10:21 IST)
Updated Date: Tue, 31 Aug 2021 (10:23 IST)
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా ఈ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం కాకినాడ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది.
అల్పపీడనానికి సమాంతరంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో వాతావరణశాఖ తెలంగాణలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.