Publish Date: Fri, 30 Jul 2021 (19:06 IST)
Updated Date: Fri, 30 Jul 2021 (19:08 IST)
వరంగల్ రూరల్ జిల్లాలో విషాదం నెలకొంది. ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి కేశవ స్వామిగౌడ్, సంధ్యారాణి అనే దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన పరకాలలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. దుగ్గొండి మండలం పొనకల్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి కేశవస్వామి గౌడ్, సంధ్యారాణిలు ప్రార్థన కోసం పరకాలలోని ఓ చర్చీకి వెళ్లి అక్కడే పురుగులు మందు తాగారు. ఇది గమనించిన స్థానికులు వారిని పరకాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దంపతులు మృతి చెందారు.
అయితే ఆత్మహత్యకు ముందు మృతులు సెల్ఫీ వీడియో తీసుకున్నారు. తమను కొంతమంది వ్యక్తులు మోసం చేశారని సెల్ఫీ వీడియోలో తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ.12 లక్షల వసూలు చేశారని ఆరోపించారు. సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.