Publish Date: Mon, 02 Aug 2021 (15:08 IST)
Updated Date: Mon, 02 Aug 2021 (15:11 IST)
హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక రావడం రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో తెరపైకి వచ్చిన హుజురాబాద్ ఉప ఎన్నికను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో, ఆ నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుండడంతో.. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్లు వస్తున్నాయి.
ప్రత్యేకించి అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులకే ఈ పరిస్థితి ఎక్కువగా ఎదురవుతుంది. అయితే ఇది కాస్త బిజెపి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా పాకింది. ఈ నేపథ్యంలో గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
గోషా మహల్ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన కీలక ప్రకటన చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని నియోజకవర్గ ప్రజలు ఒత్తిడి చేస్తున్నారని, సీఎం నిధులు ప్రకటించిన వెంటనే స్పీకర్ను కలిసి రాజీనామా లేఖ ఇస్తానని గోషా మహల్ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు.
ఉప ఎన్నిక వస్తే కేసిఆర్కు బడుగులు, రైతులపై ప్రేమ వస్తుందన్నారు. అంతేకాకుండా గోషామహల్ నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ బీసీలకు సైతం పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇస్తే కచ్చితంగా స్పీకర్ దగ్గరకు వెళ్లి రాజీనామా పత్రాన్ని అందజేస్తానని రాజా సింగ్ స్పష్టం చేశారు.