Publish Date: Sun, 05 Nov 2023 (11:27 IST)
Updated Date: Sun, 05 Nov 2023 (11:26 IST)
ఈ నెలాఖరులో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అన్ని పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాదయాత్రను చేపట్టాలని నిర్ణయించుకున్నారు.
ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేశారు. పార్టీ శ్రేణుల్లో ఓ ఊపు తెచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు మరోసారి ఆయనతో పరిమిత పాదయాత్ర చేయించాలని నిర్ణయించినట్లుగా వార్తలు వచ్చాయి. అధిష్టానం నుంచి సూచనలు రావడంతో బండి సంజయ్ పాదయాత్రకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని చెబుతున్నారు.
ఈ పాదయాత్ర ఈ నెల 7వ తేదీన కరీంనగర్ పట్టణం నుంచి ప్రారంభంకానుంది. ఎన్నికలకు మరెంతో సమయం లేనందున కరీంనగర్, సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాలలో పాదయాత్ర ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏడో తేదీన కరీంనగర్లో ప్రారంభమయ్యే పాదయాత్ర 8వ తేదీన సిరిసిల్ల, నారాయణపేట నియోజకవర్గాల్లో ఉండనుంది. బుల్లెట్ ప్రూఫ్ కారుతో ఆయన ప్రచారం చేయనున్నారు. మరోవైపు, తనకు పార్టీ అధిష్టానం కేటాయించిన హెలికాప్టర్తో ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నారని చెబుతున్నారు.