సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 13 మంది మృతి చెందగా మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రమాదం జరిగిన సమయంలో 108 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం.
సోమవారం నాడు పాశమైలారం ఇండస్ట్రియల్ ఏరియాలోని సిగాచీ రసాయన పరిశ్రమలోని రియాక్టర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ఈ భారీ పేలుడు కారణంగా రియాక్టర్ పరిధిలోని భవనం కూలిపోగా మరో భవనం బీటలు బారింది. ఈ ప్రమాదంలో ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ గోవన్ మృతి చెందారు.
పేలుడు జరిగిన సమయంలో ఆయన కారులో వచ్చారు. ఆయన అలా వచ్చి కారు లోపల నుంచి దిగే సమయానికి పేలుడు జరగడంతో ఆయన మృత్యువాత పడ్డారు. ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ప్రమాదం జరగడానికి కారణాలేమిటన్నది దర్యాప్తు చేస్తున్నారు.