Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైకోర్టు తలుపుతట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకు?

Advertiesment
Revanth Reddy

ఠాగూర్

, బుధవారం, 23 ఏప్రియల్ 2025 (18:13 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోర్టు మెట్లెక్కారు. తనపై భారతీయ జనతా పార్టీ నేత దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును కొట్టి వేయాలని సీఎం రేవంత్ అభ్యర్థించారు. గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఎన్నికల ప్రసంగంపై తెలంగాణ బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని, కేసుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కాగా, ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిగే అవకాశం ఉంది. 
 
గత యేడాది జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు రేవంత్ చేసిన వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ఆ సభలో అన్నారని వెంకటేశ్వర్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు కేసు విచారణ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే కొందరు సాక్షుల వాంగ్మూలాలను కూడా రికార్డు చేసింది. అలాగే, రేవంత్ రెడ్డి ప్రసంగానికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగులను కూడా కాసం వెంకటేశ్వర్లు కోర్టుకు సమర్పించారు. 
 
ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల కోర్టులో సాగుతున్న విచారణను నిలిపివేయాలని, తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అలాగే, తనకు కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కూడా ఆయన తన పిటిషన్‍లో అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలుశిక్ష తప్పదా? అడ్వకేట్ ఏమంటున్నారు?