Publish Date: Mon, 28 Apr 2025 (23:10 IST)
Updated Date: Mon, 28 Apr 2025 (23:12 IST)
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గాయపడ్డారు. ఆయన సోమవారం జిమ్లో వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి వైద్యం చేశారు. కాగా, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
వైద్యుల పర్యవేక్షణలో కోలుకున్నట్టు పేర్కొన్నారు. త్వరగా కోలుకుని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పలువురు భారత రాష్ట్ర సమితి నేతలు, అభిమానులు కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు పెడుతున్నారు.
మరోవైపు, కేటీఆర్ త్వరగా కోలుకోవాలంటూ జనసేన పార్టీ అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఎక్స్లో ఓ పోస్ట్ చేసింది. సోదరుడు, తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిమ్లో వ్యాయామం చేస్తూ గాయపడ్డారని తెలిసింది. వైద్యుల సూచనలకు అనుగుణంగా తగిన విశ్రాంతి తీసుకోవాలి. త్వరలో కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అని పవన్ పేర్కొన్నారు.