Publish Date: Mon, 09 Jun 2025 (15:41 IST)
Updated Date: Mon, 09 Jun 2025 (15:44 IST)
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీ ఆర్టీసీ) ప్రయాణికులకు షాకిచ్చింది. వివిధ రకాల బస్ పాస్ల ధరలను గణనీయంగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన చార్జీలను సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయి. సాధారణ ప్రయాణికులతో పాటు విద్యార్థులు వినియోగించే పాస్ ధరలు కూడా పెరిగాయి. సగటున 20 శాతానికి పైగా ఈ పెంపుదల ఉంది.
పెంచిన బస్ పాస్ చార్జీలు అమల్లోకి వచ్చాయి. 20 శాతానికి పైగా బస్పాస్ రేట్లను పెంచారు. రూ.1,150 ఉన్న ఆర్డీనరీ పాస్ ధరను రూ.1,400కు పెంచారు. రూ.1,300 ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ ధరను రూ.1,600కు పెంచారు. రూ.1,450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ను రూ.1,800కు పెంచారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఏసీ పాస్ ధరలను ఆర్టీసీ పెంచింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వినియోగించే ఇతర పాస్లు, గ్రీన్ మెట్రో ఏసీ బస్ పాస్ ధరలను కూడా టీజీ ఆర్టీసీ సవరించింది. ఈ ఆకస్మిక పెంపుదల నెలవారీ పాస్లపై ఆధారపడే వేలాది మంది ప్రయాణికులపై అదనపు భారం మోపనుంది. ముఖ్యంగా ఉద్యోగులకు, విద్యార్థులపై ప్రభావం పడనుంది.
ఇటీవల హైదరాబాద్ మెట్రో టిక్కెట్ ధరలను కూడా పెంచారు. ఏడేళ్ల తర్వాత తొలిసారి ధరల పెంపును ఎల్ అండ్ టి మెట్రో రైల్ లిమిటెడ్ మే 17న అమల్లోకి తెచ్చింది. మొదటి 20 శాతం టిక్కెట్ ధరలను పెంచిన ఎల్ అండ్ టి, ఆ తర్వాత పది శాతం తగ్గించిన విషయం తెల్సిందే.