మద్యం మత్తులో వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన భార్య అనుకుని పక్కింటి అమ్మాయిని కత్తితో పొడిచాడు. ప్రస్తుతం ఆ యువతి గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్రలోని నాందేడ్కు చెదిన సలీం (60), రేష్మ దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో ఒకరు మానసిక వ్యాధితో బాధపడుతుండగా, మరొక కుమార్తె హైదరాబాద్ నగరంలోని మైలార్దేవ్పల్లి డివిజన్ టీఎన్జీవోస్ కాలనీలో ఉంటోంది. బక్రీద్ పండుగ సందర్భంగా సలీం దంపతులు తమ కుమార్తె ఇంటికి వచ్చారు.
సోమవారం రాత్రి సలీం మద్యం సేవించి, భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలోను రేష్మను చంపేస్తానంటూ కూరగాయల కోసే కత్తితో బెదిరించాడు. దీంతో ఆమె కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీసింది. వారి గొడవను ఆపేందుకు పక్కింట్లో ఉంటున్న జుబేదా (26) అనే యువతి ఇంట్లో నుంచి బయటకు వచ్చింది.
అయితే, జుబేదాను తన భార్యగా భావించిన సలీం.. కత్తితో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన జుబేదా.. అక్కడిడక్కడే కుప్పకూలిపోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడిన జుబేదాను ఆస్పత్రికి తరలించారు. సలీంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.