Publish Date: Mon, 14 Jun 2021 (09:10 IST)
Updated Date: Mon, 14 Jun 2021 (09:11 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ ఆలయం తిరుమల శ్రీవారి క్షేత్రంలో మూడు రోజులపాటు జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నారు. ఏటా ఈ కార్యక్రమాన్ని జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠా నక్షత్రానికి ముగిసేలా నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల22 నుంచి 24 వరకు జ్యేష్ఠాభిషేకం కార్యక్రమం జరగనుంది. అభిషేకాలతో శ్రీవారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా పరిరక్షించేందుకు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్సవం సందర్భంగా ఆలయంలో ఈనెల 24న వర్చువల్ ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాలను టీటీడీ రద్దు చేసింది.
ఇందులోభాగంగా మొదటిరోజు మలయప్పస్వామికి ఉన్న బంగారు కవచాన్ని తీసివేసి హోమాలు, అభిషేకాలు, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం వజ్రకవచం అలంకరించి మాడవీధుల్లో ఊరేగిస్తారు.
రెండోరోజు ముత్యాల కవచ సమర్పణచేసి ఊరేగింపు నిర్వహిస్తారు. చివరిరోజైన 24న తిరుమంజనాదులు పూర్తిచేసి బంగారు కవచాన్ని సమర్పించి ఊరేగించనున్నారు. ఈ బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే ఏడాది జ్యేష్టాభిషేకంలోనే తీస్తారు.