Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నూనెను ఇస్తున్న మీరు, తీసుకుంటున్న నేను అశాశ్వతమైనవారమే, కానీ...

నూనెను ఇస్తున్న మీరు, తీసుకుంటున్న నేను అశాశ్వతమైనవారమే, కానీ...
, మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (22:54 IST)
శిరిడీ సాయిబాబా నిత్యం మేలుకోగానే ధుని(అగ్నిగుండం) సమీపంలో ఉన్న స్తంభాన్ని ఆనుకుని కాసేపు ధ్యానంలో ఉండటం, ధునిలో ఒక్కొక్కటిగా సమిధలను వేస్తుండటం చేసేవారు. అంతేకాదు ఏవో మంత్రాలను మంద్రస్వరంతో ఉచ్ఛరిస్తుండటం, రోజులో చాలా భాగం ఇతరులకు దూరంగా ఉంటూ ఏకాంతంలో గడుపుతుండటం, తనకు అంతరంగ భక్తులను మాత్రమే దగ్గరకు రానివ్వడం, తనకు నచ్చిన భక్తులతోనే కాసేపు మాట్లాడటం, భిక్షగా స్వీకరించిన పదార్థాలను మాత్రమే తినడం, తర్వాత ఆ భిక్షను తనతో ఉన్నవారందరితో పంచుకోవడం చేస్తూ ఉండే బాబా, మొక్కలకు నీళ్లు పోయడం, ద్వారకామాయి గోడలపై దీపాలు వెలిగించడం చేస్తుండేవారు. 
 
ఆ తదనంతరం అప్పుడప్పుడు ధ్యానమో, మౌనమో అవలంభించి బాహ్య విషయాలకు ప్రాధాన్యతనివ్వకుండా కాలం గడుపుతుండేవారు. ఇవే బాబా అనుదిన చర్యలు. ఇక సాక్షాత్ భగవంతుడే తమ ఇంటి ముందుకు భిక్ష కోసం వస్తుంటే, పట్టించుకోకపోవడమంటే.. ఖచ్చితంగా షిరిడీవాసులు దురదృష్టవంతులే కదా. ఈ నిర్లక్ష్య భావన మెల్లమెల్లగా ఒకరి ద్వారా ఒకరికి పాకుతూ... షిరిడీలోని వర్తకులకు కూడా అంటుకుంది. బాబా మసీదులో వెలిగిస్తున్న దీపాలకు కావలసిన నూనెను షిరిడీ వర్తకులు ఉచితంగా ఇస్తుండేవారు. కానీ వారి బుద్ధి మందగించింది. బాబాకు నూనెను ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. వారు చేసింది క్షమించరాని తప్పిదమే అయినప్పటికీ, అందులోనూ మంచి జరిగింది. 
 
అప్పటివరకూ పిచ్చి ఫకీరు అని అనుకుంటున్న లోకానికి, స్వామి మహిమ కళ్లారా చూసి వినమ్రంగా చేతులు జోడించి మొక్కే అద్భుతమైన అవకాశం లభించింది. బాబా ఎప్పటివలెనే ద్వారకామాయి ముందు దీపాలను వెలిగించేందుకై నూనె కోసం ఓ అంగడి ముందు నిలిచి... అల్లా మాలిక్ అన్నాడు. నూనె అయిపోయింది వెళ్లు వెళ్లు అన్నాడా వర్తకుడు. మారుమాట్లాడకుండా మరో దుకాణం ముందుకెళ్లి నిలబడ్డ బాబా మళ్లీ అల్లా మాలిక్ అన్నాడు. 
 
పోపో... నూనె కావాలంట నూనె, పనీ పాటలేకపోతే సరి అంటూ ఈసడించుకున్నాడో వర్తకుడు. అన్ని దుకాణాల ముందు ఆగి నూనె కోసం అడిగి, అడిగి ఖాళీ డబ్బాతో ద్వారకామాయికి చేరుకున్నాడు బాబా. సూర్యుడు పశ్చిమాద్రికి చేరుకుంటున్నాడు. మెల్లమెల్లగా చీకట్లు కమ్ముకుంటున్నాయి. మెల్లగా లేచిన బాబా మసీదు గోడలపై ప్రమిదలను పేర్చుతున్నాడు. ఆ ప్రమిదల్లో ఒత్తులను అమర్చసాగాడు. 
 
బాబా చేస్తున్న పనిని చూస్తున్న వర్తకులకు విస్మయం కలిగింది. నూనె లేకుండా దీపాలను ఎలా వెలిగిస్తాడు అని చూస్తున్నారు. ఈ విషయాన్ని విన్నవారంతా అక్కడకు చేరుకుంటున్నారు. అంతా బాబానే చూస్తున్నారు. బాబాకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. ఈ తతంగాన్నంతా చూస్తోన్న శ్యామాకు మాత్రం బాబా చేస్తున్నదంతా పిచ్చి చేష్టగా అనిపించసాగింది. ఖాళీగా ఉన్న నూనె డబ్బాలో నీళ్లు పోసిన బాబా, ఆ డబ్బాను పైకెత్తి కొంత నీటిని నోట్లో పోసుకుని పుక్కిళించి, మరలా ఆ నీటిని డబ్బాలో పోశాడు. తర్వాత ఆ నీటితో ప్రమిదలను నింపాడు. ఒత్తులను వెలిగించసాగాడు.
 
అద్భుతం, ఆశ్చర్యం... దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. నీళ్లతో వెలిగించిన దీపాలు వెలుగుతున్నాయి. వెలగడమే కాదు.. నూనె దీపాలకంటే వేయిరెట్లు కాంతులీనుతున్నాయి. ఆ అద్భుతాన్ని చూస్తున్న శ్యామా భయభక్తులతో చెంపలు వేసుకుంటూ చేతులు జోడించి, జై బోలో సాయిబాబాకీ అంటూ నినాదం చేయగా, అక్కడున్న ప్రజలంతా జై అంటూ పలికారు. ఆ అద్భుతాన్ని చూసిన వ్యాపారస్తులంతా బాబా కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నారు. 

అప్పుడు బాబా... దేన్నైనా చేతిలో ఉంచుకుని ఇవ్వలేనని చెప్పడం తప్పుకాదు కానీ... ఆ వస్తువును చేతిలో ఉంచుకుని కూడా లేదని చెప్పడం తగదు. దీపంలో పరబ్రహ్మ ఉన్నాడు. అందుకే ఇవాళ ప్రమిదలలో నీరు పోసినప్పటికీ రెట్టింపు వెలుగుతో ప్రకాశిస్తున్నాడు. నూనెను ఇస్తున్న మీరు, తీసుకుంటున్న నేను అశాశ్వతమైనవారమే. కానీ ఈ జ్యోతులలో ప్రకాశిస్తున్న పరబ్రహ్మ శాశ్వతం... అల్లా మాలిక్.. ఇదే బాబా మొదటి సందేశం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అక్షయ తృతీయ రోజున గోమాతను పూజిస్తే.. ఎంత మేలో తెలుసా?