Publish Date: Mon, 08 May 2023 (17:13 IST)
Updated Date: Mon, 08 May 2023 (20:23 IST)
స్వచ్ఛమైన మనస్సు, వారి వైపు న్యాయం ఉన్న ఎవరైనా వారాహి దేవిని పూజించవచ్చు. వారాహి దేవిని పంచమి తిథుల్లో పూజించే వారికి సర్వాభీష్టాలు చేకూరుతాయి. నిస్వార్థమైన అభ్యర్థనను వారాహి దేవి వెంటనే నెరవేర్చుతుంది. కానీ వక్రబుద్ధితో, ఇతరులకు హాని చేయాలనే ఉద్దేశ్యంతో వారాహి దేవిని పూజించడం కూడదు. దాంతో నాశనం తప్పదు.
శుక్లపక్షం పంచమి మే 09న వస్తోంది. మంగళవారంతో పాటు వచ్చే ఈ రోజున వారాహి దేవికి ఏ నైవేద్యాన్ని సమర్పించి పూజిస్తే మరిన్ని ఫలితాలు వస్తాయో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. ఎప్పటిలాగే ఇంట్లో వారాహి అమ్మవారి ప్రతిమ లేదా విగ్రహం ఉన్నా లేకున్నా మీరు ఈ పూజను నిర్వహించవచ్చు.
దీపం వెలిగించి, అందులో వారాహి అమ్మవారు ఉన్నారని భావించి, ఆమెను శ్రద్ధతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే ఎర్రని దానిమ్మ పండు గింజలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తమలపాకు, పువ్వులు, పండ్లు సమర్పించవచ్చు.
మందార పువ్వును సమర్పిస్తే చాలా ప్రత్యేకం. అంతేగాకుండా కొబ్బరి పువ్వును వారాహి అమ్మవారికి సమర్పించడం ద్వారా ఈతిబాధలు తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందులు వుండవు. కొన్ని చోట్ల కొబ్బరి పువ్వును విడిగా విక్రయిస్తారు. ఆ కొబ్బరి పువ్వును కొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు.
ఒకవేళ కొబ్బరి పువ్వు లేకుంటే కొబ్బరి తురుములో కాసింత బెల్లం వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇలా చేస్తే వ్యాపారంలో సమస్యలు, శత్రుబాధలు, నరదృష్టి, తీరని రోగం, ఋణ బాధలు మొదలైన అన్ని రకాల సమస్యలకు తక్షణమే చక్కని పరిష్కారాన్ని ఇచ్చే శక్తి ఈ వారాహి పూజకు ఉంది.