కాలాష్టమి చాలా శక్తివంతమైనది. కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవునికి ఈరోజును అంకితం చేస్తారు. శివుని అంశంగా భావించే కాలభైరవునికి మిరియాల దీపం, గుమ్మడి దీపం, కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా ఈతిబాధలు వుండవు. నరదృష్టి దోషాలు తొలగిపోతాయి. అలాంటి కాలాష్టమి ఫిబ్రవరి 20, 2025న వచ్చింది.
ఈ కాలాష్టమి తిథి ఫిబ్రవరి 20, 2025 ఉదయం 09.58కి ప్రారంభమవుతుంది. అలాగే ఫిబ్రవరి 21, 2025 ఉదయం 11.57 గంటలకు ముగుస్తుంది. కాలభైరవుడు దేశంలోని అన్నీ దేవాలయాలకు క్షేత్రపాలకుడిగా వుంటాడని విశ్వాసం. కాలభైరవుడిని పూజించడం ద్వారా మంత్రతంత్రాలు పనిచేయవని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. అందుకే ఈ రోజున ఉపవాసం పాటించి, కాలభైరవ అష్టకాన్ని పఠించాలి.
అలాగే కాలభైరవ ఆలయానికి వెళ్లి ఆవనూనెతో దీపం వెలిగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ రోజున శునకాలకు ఆహారం అందించాలి. రోడ్డుపై తిరిగే శునకాలకు ఆహారం ఇవ్వాలి. ఇంకా నలుపు శునకాలకు కాలభైరవాష్టమి రోజున ఆహారం అందించే వారికి సమస్త దోషాలు తొలగిపోతాయి.
కాలాష్టమి ప్రాముఖ్యత
కాలాష్టమి ప్రాముఖ్యత ఆదిత్య పురాణంలో చెప్పబడి వుంది. శివుని అవతారంగా, కాల భైరవుడు పూజలు అందుకుంటున్నాడు. ముఖ్యంగా బ్రాహ్మణులకు ఆహారం, దుస్తులు, డబ్బును దానం చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. కాలాష్టమి నాడు కాలభైరవుని వాహనంగా భావించే నల్ల కుక్కకు పాలు, పెరుగు, స్వీట్లు వంటి తినిపించడం విశేష ఫలితాలను ఇస్తుంది.