పితృదోషాలను ఎలా తొలగించుకోవాలో తెలుసా?
పూర్వీకులు, తాతముత్తాలను పితృదేవతలు అంటారు. వారికి జరగాల్సిన ప్రేత కార్యక్రమాలను సక్రమంగా చేయని పక్షంలో దోషమనేది ఏర్పడుతుంది. పితృదేవతలకు సరిగ్గా ప్రేత కార్యక్రమాలు చేయనివారింట ఈతిబాధలు, వంశాభివృద్ధి
Publish Date: Tue, 03 Jul 2018 (13:22 IST)
Updated Date: Tue, 03 Jul 2018 (13:25 IST)
పూర్వీకులు, తాతముత్తాలను పితృదేవతలు అంటారు. వారికి జరగాల్సిన ప్రేత కార్యక్రమాలను సక్రమంగా చేయని పక్షంలో దోషమనేది ఏర్పడుతుంది. పితృదేవతలకు సరిగ్గా ప్రేత కార్యక్రమాలు చేయనివారింట ఈతిబాధలు, వంశాభివృద్ధి లేకపోవడం వంటి ఇబ్బందులు ఏర్పడుతాయి. అలాంటి వారి పితృ దేవతలను పూజించడం చేయాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
పితృ దేవతలకు తద్దినం రోజున నైవేద్యాలు సమర్పించకపోతే.. ఆ వంశంలో సంతాన లేమి కలగడం, లేకుంటే సంతానం నిలవకపోవడం.. ఒకవేళ నిలిచినా వారు ఏదో ఒక ఇబ్బందులతో సతమతమవుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అలాంటివారు పూర్వీకుల గోత్రాన్ని బట్టి పూజలు చేసుకోవాలి. పితృదోషంపై దిలీప మహారాజే బాధపడినట్లు పురాణాలు చెప్తున్నాయి. తనకు సంతానం కలగకపోవడంతో పితృదోషం తాకిందేమోనని ఆయన బాధపడినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. అలాంటిది పితృదోషంపై విష్ణుధర్మోత్తర పురాణంలో సప్తరుషి వ్రతం అని వుంది.
ఈ సప్తరుషి వ్రతాన్ని ఏడు రోజుల పాటు చేస్తారు. గోత్రాల నామాల ఆధారంగా ఈ పూజ వుంటుంది. అయితే గోత్రాల పేర్లు గుర్తులేకుంటే పితృదేవతల పేర్లపై అభిషేకాలు, అర్చనలు చేయించడం ద్వారా ఆ దోషాలను తొలగించుకోవచ్చు. ఇంకా నాగదేవతను పూజించడం ద్వారా పితృదోషాలుండవు.
అలాగే విష్ణుదేవాలయాల్లో గరుడ స్తంభం లేదా ధ్వజస్తంభం దగ్గర నేతితో దీపారాధన చేసేవారికి పితృదోషాలు దరిచేరవు. ఇంకా ఏడాది ఒకసారి పితృదేవతలకు శ్రాద్ధమివ్వడం, అమావాస్య రోజున కాకులను చేతనంతైనా ఆహారం పెట్టడం, పేదలకు అన్నదానం చేయడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.