Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లి వేడుకకు వేదికైన ఐసీయూ వార్డు... ఎక్కడ?

Advertiesment
marriage

ఠాగూర్

, శుక్రవారం, 21 నవంబరు 2025 (19:46 IST)
ఓ వివాహ వేడుకలు ఆస్పత్రి అత్యవసర సేవల విభాగం (ఐసీయు) వేదికగా నిలిచింది. ఈ పెళ్లికి ఆస్పత్రి వైద్యులు, నర్సులు, ఆస్పత్రి సిబ్బందే అతిథులయ్యారు. ఈ అరుదైన ఘటన కేరళ రాష్ట్రంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కేరళ రాష్ట్రంలోని తంబోలికి చెందిన వీఎం శరణ్‌, అలప్పుళలోని కొమ్మాడికి చెందిన అవనికి శుక్రవారం మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది. శుక్రవారం ఉదయం వధువును అలంకరణ కోసం కుమారకోమ్‌కు తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నవ వధువుకు గాయాలయ్యాయి. 
 
దీంతో స్థానికులు ఆమెను కొట్టాయంలోని మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. అయితే, వెన్నెముక భాగంలో గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ప్రత్యేక వైద్యం కోసం కోచ్చిన్‌లోని వీపీఎస్‌ లేక్‌షోర్‌ ఆస్పత్రికి తరలించారు.
 
ఈ సమాచారం తెలుసుకున్న ఇరు కుటుంబ సభ్యులు ఆందోళనతో హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకొని.. పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాము అనుకున్న ముహూర్తానికే వివాహం జరిపించాలని నిశ్చయానికి వచ్చి వైద్యులను సంప్రదించారు. ఇరు కుటుంబాలూ కోరడంతో వైద్యులూ సరే అన్నారు. ఎమర్జెన్సీ గదిలోనే తాళి కట్టేలా ఏర్పాట్లు చేశారు. 
 
బంధుమిత్రుల కోలాహలం మధ్య ఎంతో సందడిగా జరగాల్సిన ఈ వివాహం.. రోడ్డు ప్రమాదం కారణంగా కేవలం కొద్దిమంది వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఇరు కుటుంబాల సమక్షంలో ముహూర్తం సమయానికి జరిపించారు. వధువుకి వెన్నెముక భాగంలో గాయమైందని, త్వరలోనే శస్త్రచికిత్స చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సరికొత్త ఆవిష్కరణలు చేసేలా విద్యార్థులను ఆహ్వానిస్తూ ఐడియాథాన్‌కి సీడీఎస్ఎల్ శ్రీకారం