జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి తెగబడ్డారు. దీంతో కాశ్మీర్ పర్యాటక అందాలను తిలకించాలని ముందస్తు బుక్కింగ్స్ చేసుకున్న పర్యాటకులు తమ బుక్సింగ్స్ను రద్దు చేసుకుంటున్నారు. ఇది కాశ్మీర్ పర్యాటక రంగంపై పెనుప్రభావం చూపనుంది. జమ్మూకాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత పరిస్థితులు క్రమంగా చక్కబడటంతో పాటు కాశ్మీర్ పర్యాటకం కూడా వృద్ధి చెందుతూ వచ్చింది. అయితే, ఈ ఉగ్రదాడి కాశ్మీర్ పర్యాటక రంగంపై పెనుప్రభావం చూపనుంది. ఈ దాడిలో పర్యాటకులలో భయాందోళనలను రేకెత్తించడంతో పాటు దేశ వ్యాప్తంగా ప్రతికూల సంకేతాలను నింపింది. దాడి జరిగిన వెంటనే పర్యాటకులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవడం మొదలుపెట్టారు.
మాకు జూన్ వరకు 90 శాతం బుక్కింగ్స్ ఖరారయ్యాయి. కానీ, దాడి తర్వాత దాదాపు 80 శాతం బుక్కింగ్స్ రద్దు అయ్యాయి అని శ్రీనగర్కు చెందిన ఓ టూర్ ఆపరేటర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుక్కింగ్స్ రద్దు కంటే ఈ దాడి పర్యాటక రంగంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
దాడి తర్వాత కాశ్మీర్కు పర్యాటకులు వచ్చిన తమ భద్రత గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు బిక్కుబిక్కుమంటూ పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తారని తెలిపారు. ఏళ్ల తరబడి శ్రమించి పర్యాటకులను కాశ్మీర్ సందర్శనకు ఒప్పించామని, కానీ, ఈ దాడి తర్వాత ఆ ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులా తయారయ్యారని మరో ఆపరేటర్ వెల్లడించారు.
గత ఐదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న పరిస్థితులు ఈ ఒక్క ఉగ్రదాడి తర్వాత పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వం మాత్రం పరిస్థితిని సమర్థవంతంగా నియంత్రిస్తే జూన్ నెలలో అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యే నాటికి పరిస్థితి మెరుగుపడవచ్చని కొందరు ఆపరేటర్లు అభిప్రాయపడుతున్నారు.