Publish Date: Thu, 29 Apr 2021 (14:40 IST)
Updated Date: Thu, 29 Apr 2021 (14:50 IST)
కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో దేశంలోని అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. ఇక మరికొన్ని రాష్ట్రాలు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నాయి. విపరీతంగా పెరుగుతున్నకరోనా కేసుల కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే మార్గమని భావిస్తున్నాయి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ తరుణంలోనే నెమ్మదిగా లాక్ డౌన్ వైపు అడుగులు వేస్తున్నాయి.
ఇక గోవా ప్రభుత్వం కూడా లాక్ డౌన్ విధించేందుకు ముందుకు వచ్చింది. గురువారం సాయంత్రం 7 గంటల నుంచి మే 3వ తేదీ ఉదయం వరకు లాక్ డౌన్ విధించనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ మీడియాకు వెల్లడించారు. అత్యవసర సేవలను, వివిధ పరిశ్రమలను లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు ప్రమోద్.
అత్యవసర వస్తు సర్వీసుల కోసం రాష్ట్ర సరిహద్దులు తెరిచే ఉంటాయని సీఎం తెలిపారు. ఇక వలస కూలీలు ఎవరి రాష్ట్రాన్ని వదిలి వెళ్లకూడదని తెలిపారు. 20 లక్షల జనాభా ఉన్న గోవాలో 85 వేలమంది కరోనా బారినపడ్డారు. కరోనాతో 1110 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఈ రాష్ట్రంలో 3101 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో రికవరీ రేటు 76.54% గా ఉంది.