దేశంలో సంచలనం సృష్టించిన మేఘాలయ 'హనీమూన్ హత్య' కేసు త్వరలో వెండితెరపై సినిమాగా రానుంది. బాలీవుడ్ దర్శకుడు ఎస్పీ నింబావత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇందుకు మృతుడు రాజా రఘువంశీ కుటుంబసభ్యులు కూడా సమ్మతి తెలిపారు. 'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో ఈ చిత్రాన్ని తీసుకురానున్నారు.
'ఈ హత్య కేసుపై సినిమా తీసేందుకు మేం అంగీకరించాం. మా సోదరుడి మృతిని వెండి తెర పైకి తీసుకొస్తేనే.. ఎవరిది తప్పు..? ఎవరిది ఒప్పు? అనేది ప్రజలు తెలుసుకుంటారు అని మేం విశ్వసిస్తున్నాం' అని మృతుడు రాజా రఘువంశీ సోదరుడు సచిన్ మీడియాకు తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు నింబావత్ మాట్లాడుతూ, భవిష్యత్తులో ఇలాంటి ఘోరాలు ఆగాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా తీసేందుకు సిద్ధమయ్యాం. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. 80 శాతం చిత్రాన్ని ఇండోర్లో 20 శాతం సీన్లు మేఘాలయలో తెరకెక్కిస్తాం అని తెలిపారు.
అయితే, ఈ చిత్రంలో నటించే నటీనటుల వివరాలను ఆయన వెల్లడించలేదు. ఎస్పీ నింబావత్ గతంలో పలు హిందీ సినిమాలకు ప్రొడ్యూసర్, రచయితగా వ్యవహరించారు. 2018లో కబడ్డీ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇదిలాఉండగా.. ఈ హనీమూన్ హత్య కేసుపై బాలీవుడ్ స్టార్ నటుడు అమీర్ ఖాన్ సినిమాను తీయనున్నట్లు ఇటీవల వార్తలు రాగా.. ఆయన వాటిని ఖండించారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ కుటుంబం ట్రాన్పోర్టు వ్యాపారం చేస్తోంది. ఈ యేడాది మే 11న అతడికి సోనమ్తో వివాహం జరగ్గా.. 20న హనీమూన్ కోసం ఈ నవదంపతులు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వీరు కన్పించకుండా పోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు.